Harish Rao: దక్షిణాదిన కేసీఆర్ మూడోసారి గెలిచి రికార్డ్ సృష్టిస్తారు: హరీశ్ రావు

Harish Rao says KCR will creat record with winning third time

  • దక్షిణాదిన ఇంతవరకు ఎవరూ మూడోసారి ముఖ్యమంత్రి కాలేదన్న హరీశ్ రావు
  • కేసీఆర్ పాలనలో కరవు, కర్వ్ఫ్యూలు లేవన్న మంత్రి
  • తెలంగాణ సంపద పెరిగిందని వెల్లడి 
  • వరి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి ఎదిగామన్న హరీశ్ రావు

ప్రతిపక్ష పార్టీలకు ఒక అజెండా అంటూ లేదని, విపక్షాల నేతలు తమ పార్టీ నాయకులను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. హైదరాబాద్‌లో తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... దక్షిణాదిన ఇంతవరకు ఎవరూ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కాలేదని, కానీ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి మూడోసారి సీఎం కావడం ద్వారా చరిత్ర సృష్టిస్తారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరవు, కర్ఫ్యూలు లాంటివి లేవన్నారు. రాష్ట్ర సంపద పెరిగిందని, అప్పులలో తెలంగాణ రాష్ట్రం కింద నుంచి ఐదో రాష్ట్రంగా ఉందన్నారు. రాష్ట్ర సంపదను ఇంకా పెంచుతామని, ప్రజలకు పంచుతామన్నారు. హైదరాబాద్‌లో మౌలిక వసతులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు.

కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. అక్కడ వాళ్లు చెప్పుకుంటున్న ఐదు గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతుందని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ చేసిన పనులను చూసిన ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించబోతున్నార్నారు. సీఎం నేతృత్వంలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చామన్నారు. నగరానికి గ్రీన్‌ సిటీ అంతర్జాతీయ అవార్డును సాధించామని గుర్తుచేశారు.

ప్రతిపక్ష నేతలకు ప్రజలు పోలింగ్‌ బూత్‌లలో బుద్ధి చెప్పాలని సూచించారు. తెలంగాణ బిడ్డ కేసీఆర్‌ను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయన్నారు. ఆ రెండు పార్టీలకు... రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. కాంగ్రెస్‌... బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను కాపీ కొట్టిందన్నారు. కాంగ్రెస్‌‌కు గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని చరిత్ర ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడు 76 శాతానికి చేరుకున్నాయన్నారు. వెయ్యికి పైగా గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ఎన్నికల హామీల్లో ప్రకటించిన కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, కేసీఆర్ బీమా, రైతుబంధు అమలు చేస్తున్నామన్నారు.

కేసీఆర్ విజన్ వల్ల రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను అధిగమించగలిగామన్నారు. తాము మేనిఫెస్టోలో పెట్టిన హామీలను 90 శాతం అమలుపర్చామన్నారు. మరికొన్ని మ్యానిఫెస్టోలో పెట్టని పనులు కూడా చేశామన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కొత్తగా ఆరు లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించామన్నారు. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. దేశంలో వచ్చే ప్రతి మూడు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి మన దగ్గరే ఉందన్నారు. ప్రయివేటు రంగంలో 24 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటి తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు.

  • Loading...

More Telugu News