Team India: కోహ్లీ సెంచరీ మిస్సయినా... టోర్నీలో కివీస్ కు తొలి ఓటమి రుచిచూపిన టీమిండియా

Team India defeats New Zealand by 4 wickets

  • వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × న్యూజిలాండ్
  • 4 వికెట్ల తేడాతో గెలిచిన టీమిండియా
  • టీమిండియా ముందు 274 పరుగుల టార్గెట్
  • 48 ఓవర్లలో 6 వికెట్లకు కొట్టేసిన టీమిండియా
  • 95 పరుగులు చేసిన కోహ్లీ

మొన్న టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, ఇవాళ టీమిండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లోనూ అవే పరిస్థితులు కనిపించాయి. బంగ్లాదేశ్ పై ఛేజింగ్ లో కీలకపాత్ర పోషించి సెంచరీతో టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీ... ఇవాళ కూడా అవే పరిస్థితుల నడుమ సెంచరీ కోసం తీవ్రంగా ప్రయత్నించాడు. 

అయితే శతకానికి 5 పరుగుల దూరంలో అవుటయ్యాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాట్ హెన్రీ బౌలింగ్ లో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కోహ్లీ నిష్క్రమించినప్పటికీ... 274 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. 

సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియాకు ఇది వరుసగా ఐదో విజయం. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యఛేదనలో టీమిండియా 48 ఓవర్లలో 6 వికెట్లకు 274 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

ఛేజింగ్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ జోడీ తొలి వికెట్ కు 71 పరుగులు జోడించి సరైన పునాది వేసింది. రోహిత్ శర్మ, గిల్ అవుటైన తర్వాత కోహ్లీ... శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. అయ్యర్ 33 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ 27 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ (2) రనౌట్ కాగా... రవీంద్ర జడేజా చివరి వరకు క్రీజులో నిలిచి కోహ్లీకి చక్కని సహకారం అందించాడు. కోహ్లీ 104 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 95 పరుగులు చేశాడు. 

కాగా, ఈ వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ కు ఇది మొదటి ఓటమి. టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 29న ఇంగ్లండ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరగనుంది.

Team India
New Zealand
Virat Kohli
Dharmashala
World Cup
  • Loading...

More Telugu News