Nandamuri Ramakrishna: స్కాం లేదు, పాడూ లేదు... అంతా కల్పితం: నందమూరి రామకృష్ణ

Nandamuri Ramakrishna talks about Chandrababu issue

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • తెలంగాణలోనూ చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు
  • హైదరాబాద్ లోని సనత్ నగర్ లో చంద్రబాబు మద్దతుదారుల దీక్ష
  • హాజరైన నందమూరి రామకృష్ణ

'రాష్ట్ర ప్రజలకు ముద్దులు పెట్టి, దోచుకున్నవాడేమో ప్యాలెస్ లో ఉన్నాడు... పేద ప్రజలకు ముద్ద పెట్టిన వాడేమో జైలుపాలయ్యాడు' అంటూ నందమూరి రామకృష్ణ ఎలుగెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఇవాళ హైదరాబాదులోని సనత్ నగర్ లో టీడీపీ నేతలు, కార్యకర్తలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. 

ఈ దీక్షలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు అరెస్ట్ దగా, మోసం... దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో, చంద్రబాబు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ... మరో అడుగు ముందుకు వేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని రామకృష్ణ వివరించారు. తద్వారా యువతీయువకులకు మెరుగైన భవిష్యత్ ఇచ్చారని గుర్తుచేశారు. 

"స్కాం లేదు పాడూ లేదు. ఇదంతా కట్టుకథ. రిమాండ్ రిపోర్టులో చెప్పిన అంశాలే మళ్లీ మళ్లీ చెబుతున్నారేంటని న్యాయమూర్తి కూడా అడుగుతున్నారు. మొదట రూ.3 వేల కోట్లు అన్నారు, ఆ తర్వాత రూ.371 కోట్లకు వచ్చారు, ఆ తర్వాత రూ.27 కోట్లకు వచ్చారు. తొలుత చంద్రబాబు ఖాతా అన్నారు, ఇప్పుడు టీడీపీ ఖాతా అంటున్నారు... ఇప్పటికీ వాళ్ల వద్ద ఆధారాలు లేవు. 

2018లో దర్యాప్తు ప్రారంభించాం అంటున్నారు... ఇన్నాళ్లూ ఏంచేశారో తెలియదు. చంద్రబాబు మచ్చలేని నాయకుడు. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టే ఆయనకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు తీసుకురాలేకపోతున్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకుండా ఉంటే టాటా, బిర్లా స్థాయిలో ఉండేవారు. కానీ అన్నీ వదులుకుని ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తప్పకుండా బయటికి వస్తారు" అని నందమూరి రామకృష్ణ వివరించారు.

Nandamuri Ramakrishna
Chandrababu
Arrest
Sanath Nagar
Hyderabad
TDP
Telangana

More Telugu News