Chandrababu: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెంటిలేటర్‌పై ఉందంటూ... 17వ రోజు కొనసాగిన టీడీపీ దీక్షలు

TDP protests continues for 17th day

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న టీడీపీ శ్రేణులు
  • వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు
  • పాల్గొంటున్న టీడీపీ అగ్రనేతలు 

అక్రమ అరెస్టులు, అడ్డగోలు కేసులతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని జగన్ రెడ్డి హత్య చేస్తున్నాడని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా టీడీపీ నేతలు వరుసగా 17వ రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు, వివిధ రకాల ప్రదర్శనలు కొనసాగించారు. చంద్రబాబు యువతకు ఉద్యోగాలు, మెరుగైన ఉపాధి కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు కళ్ల ముందు కనిపిస్తున్నా అసలు కేంద్రాలే లేవు అంటూ కేసు పెట్టారని ఆరోపించారు. 

మరోవైపు, సెంటు సేకరణ చేయలేదు, అసలు రోడ్డే లేదు... అయినా అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు నిర్మాణంలో అవినీతి చేశారంటూ మరో కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలా జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం తయారైందని టీడీపీ నేతలు విమర్శించారు. 

కొత్తపేట నియోజకవర్గంలో ఇంఛార్జి బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష వినూత్నంగా చేపట్టారు. చావు బ్రతుకుల్లో వున్న మనిషిని డాక్టర్లు ఎలా బ్రతికిస్తారో అదే విధంగా... రాజ్యాంగాన్ని కాపాడే గవర్నర్, రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ లో న్యాయాన్ని బ్రతికించాలని కోరుతూ వెంటిలేటర్ పై బొమ్మకు సెలైన్ ఎక్కిస్తూ నిరసన తెలియజేశారు.  హిందూపురంలో టీఎన్ టీయూసీ, వాణిజ్య  విభాగాల ఆధ్వర్యంలో శిరోముండనంతో నిరసన తెలిపారు. 

కొవ్వూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఆధ్వర్యంలో వాడపల్లి గ్రామంలోని శ్రీ కృష్ణ ఆలయం వద్ద సంకల్ప సిద్ధియాగం నిర్వహించారు. ఆత్మకూరు నియోజకవర్గం చేజెర్లలో ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో కొరిటెపాడు కోదండరామస్వామి దేవస్థానములో వేద పండితులతో ప్రత్యేక యాగం చేపట్టారు. 

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు తమ పనిముట్లు, రాట్నం, నూలు వడికే యంత్రాలను ఏర్పాటు చేసి దీక్ష చేపట్టారు. కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యంగిరా మాత దేవాలయంలో హోమం నిర్వహించారు. కనిగిరిలో నాయకులు, కార్యకర్తలు చీపుర్లతో రోడ్లు ఊడ్చి వినూత్నంగా నిరసన తెలిపారు. 

సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ఇంచార్జి బి.కె.పార్థసారథి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం రిలే నిరాహారదీక్ష చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని, నల్ల బెలూన్లు చేతపట్టి నిరసన తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనివా కాలువలో 'జలదీక్ష' చేపట్టారు. అమలాపురం నియోజకవర్గంలో తాండవ కాలువలో అర్థనగ్న ప్రదర్శనతో పార్టీ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్ నాయుడు(గణబాబు) ఆధ్వర్యంలో మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మోకాలిపై కూర్చుని నిరసన తెలిపారు.

రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుష్కరాల రేవులో జలదీక్ష చేపట్టారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. చేతులకు ఇనుప సంకెళ్ళు తగిలించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. చిలకలూరిపేటలో చేతికి సంకెళ్లతో మాజీమంత్రి ప్రత్తిపాటి, తెదేపా నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. 

చంద్రబాబుకు మద్దతుగా 'మోత మోగిద్దాం': అచ్చెన్నాయుడు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రేపు (సెప్టెంబరు 30) రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దాం పేరుతో 5 నిముషాల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని తెలుగు దేశం పార్టీ తలపెట్టిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. 

సెప్టెంబర్ 30 తేదీ రాత్రి 7 గంటల నుంచి 7 గంటలా 5 నిముషాల వరకు(సరిగ్గా 5 నిముషాల పాటు) 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా శబ్దంచేసి చంద్రబాబు నాయుడుకు మద్దతు పలకాలని ఆ ప్రకటనలో అచ్చెన్నాయుడు కోరారు. 

Chandrababu
Arrest
Protests
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News