KCR: స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం

KCR expresses deep shock over passing away of MS Swaminathan

  • దేశీయ వ్యవసాయంలో వినూత్న పద్ధతులు తీసుకువచ్చారని కితాబు
  • వరి, గోధుమ పంటలపై స్వామినాథన్ ప్రయోగాల వల్ల ఉత్పత్తి పెరిగిందన్న కేసీఆర్
  • దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భద్రత దిశగా దార్శనికతతో కృషి చేశారని వ్యాఖ్య

భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణంతో దేశ వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో మెజార్టీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడిపడి ఉందనే దార్శనికతతో, సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయంలో స్వామినాథన్ వినూత్న పద్ధతుల్లో గుణాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించడంలో స్వామినాథన్ కృషి ఉందన్నారు.

దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ తదితర పంటలపై ఎంఎస్ స్వామినాథన్ చేసిన అద్భుత ప్రయోగాలతో మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని పేర్కొన్నారు. వ్యవసాయరంగంలో వారు చేసిన పరిశోధనలు సిఫార్సులు దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయన్నారు. దేశ జనాభా అవసరాలకు అనుగుణంగా ఆహార భద్రత దిశగా దార్శనికతతో జీవితకాలం కృషి చేసిన తొలి వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ అన్నారు.

భిన్నమైన భౌగోళిక భూసార పరిస్థితులు కలిగి, దేశంలోని రాష్ట్రాల వారిగా ప్రజలు పండిస్తున్న పంటలపై వాటిని అభివృద్ధిపై విస్తృత పరిశోధనలు చేసిన ఎంఎస్ స్వామినాథన్ ప్రతి భారత రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతాడన్నారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను ఎంఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎంఎస్ స్వామినాథన్ రాష్ట్రానికి రావడం, వారితో తాను రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావడం మరిచిపోలేనన్నారు. ఆ సందర్భంగా వారితో జరిగిన విస్తృతస్థాయి చర్చలో వారు చేసిన పలు సూచనలు అమూల్యమైనవన్నారు.

ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను వారు ఎంతగానో ప్రశంసించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. రైతు సంక్షేమంకోసం, సమ్మిళిత వ్యవసాయరంగ సుస్థిరాభివృద్ధికోసం ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫార్సులు వారి దార్శనికత ఒక రైతు బిడ్డగా తనను ఎంతగానో ప్రభావితం చేశాయన్నారు. ఒక నాడు ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో, కరువు తాండవమాడిన తెలంగాణ నేలన నేడు పసిడి పంటలు పండుతుండడం వెనక, వ్యవసాయ అభివృద్ది కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో, పంటల ఉత్పత్తిలో తెలంగాణ నేడు దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక స్వామినాథన్ స్పూర్తి ఇమిడి ఉందన్నారు.

తెలంగాణ నేలలు అత్యంత సారమంతవైనవని, పాలకులు సరియైన దృష్టి సారిస్తే తెలంగాణ దేశానికే విత్తన భాంఢాగారంగా విలసిల్లుతుందని చెప్పిన స్వామినాథన్ ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిజం చేసి చూపించిందన్నారు.  తెలంగాణలో జరుగుతున్న రైతు సంక్షేమాన్ని వ్యవసాయ రంగాభివృద్ధి గురించి తెలుసుకున్న ఎంఎస్ విశ్వనాథన్ తెలంగాణను సందర్శించడానికి ఆసక్తి కనబరిచేవారన్నారు.

ఇదే విషయాన్ని తెలుపుతూ ఇటీవలే వారితో జరిగిన రాష్ట్ర  ప్రభుత్వ ప్రతినిధుల సమావేశంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని తెలుసుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారని, తాను వీలుచూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ వారి ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడం బాధను కలిగిస్తోందన్నారు. వారి మన్ననలు పొందడం రైతుబిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమన్నారు. వారి మరణం దేశ వ్యవసాయరంగానికి తీరని లోటని,  దేశ రైతు పెద్దదిక్కును కోల్పోయిందని సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

  • Loading...

More Telugu News