Bhuma Akhila Priya: రాజన్న పాలన అని రాక్షస పాలన తెచ్చారు... చావడానికైనా సిద్ధమే కానీ తగ్గేదిలేదు: భూమా అఖిలప్రియ

Bhuma Akhila Priya on her hunger strike in Nandyal

  • చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే ఆమరణ దీక్షకు కూర్చుంటామన్న అఖిలప్రియ
  • దీక్షకు అనుమతి ఇవ్వకుంటే వారు భయపడినట్లేనని వ్యాఖ్య
  • అక్రమ కేసులు, దీక్షలు తమ కోసం కాదని, ప్రజల కోసమేనన్న అఖిలప్రియ

తమ పార్టీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాల ప్రాంతంలో తాము ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నామని, దీక్ష కోసమై తాము ఇప్పటికే చలానా కట్టామని, అంతేకాకుండా తాము దీక్ష చేసే ప్రాంతం ప్రయివేటు ప్రాంతమని, అనుమతి కోసం పోలీసులను ఆశ్రయించామని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ అన్నారు. ఆమె నంద్యాలలో మీడియాతో మాట్లాడుతూ... తమకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోందన్నారు. ఈ అంశంలోకి తాను నంద్యాల ఎమ్మెల్యేను కూడా లాగుతున్నానని, తన దీక్షకు అనుమతి ఇవ్వకపోతే మీరు భయపడ్డారని ప్రజలకు అర్థమవుతుందన్నారు. మహాత్మా గాంధీ వంటి వ్యక్తి స్వాతంత్ర్యం కోసం దీక్ష చేశారని గుర్తు చేశారు. అదే తరహాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాను, జగద్విఖ్యాత రెడ్డి దీక్షకు కూర్చుంటామన్నారు. దీనికి అభ్యంతరం ఏమిటో చెప్పాలన్నారు.

తాము శాంతియుతంగా చేసే దీక్షను అడ్డుకొని, ఇబ్బందులకు గురి చేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య మీ పోలీసుల నుంచి వచ్చినట్లుతుందని, కానీ తమ నుంచి కాదన్నారు. మీరు భయపడుతున్నారు కాబట్టి దీక్షను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తప్పు మీ వైపు ఉంది కాబట్టే తమ దీక్షకు అడ్డు చెబుతున్నారని చెప్పకనే చెబుతున్నారన్నారు. తమను అడ్డుకుంటే ఆ చెడ్డ పేరు మీకేనని, తాము చావడానికైనా సిద్ధమే అన్నారు. 

ఈ దౌర్జన్యపు, అక్రమ కేసులు.. ఇక్కడితే ఆగిపోవాలనే తాము దీక్ష చేస్తున్నామన్నారు. తమకు తప్పకుండా ప్రజల మద్దతు అవసరమన్నారు. ఈ దీక్షలు, అక్రమ కేసులు, ధర్నాలు.. ఇవన్నీ తమ కోసం కాదని, కేసులు వేయించుకోవాలని తమకెవరికీ లేదని, కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మహిళల భద్రత కోసం, యువత భవిష్యత్తు కోసం, రైతుల కోసమే తాము చేస్తున్నామన్నారు. ప్రజల కోసం పోరాటాలు చేయాలని చంద్రబాబు, లోకేశ్ పిలుపునిచ్చారని, అందుకే తాము బయటకు వస్తున్నామన్నారు.

కొంతమంది బుర్రలేని వ్యక్తులు తనను ఆళ్లగడ్డలో ఆందోళన చేసుకోవాలని చెబుతున్నారని, కానీ ఇది ఆళ్లగడ్డకో, నంద్యాలకో సంబంధించిన అంశం కాదని, ఆళ్లగడ్డ నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశమన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేతకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఎంతోమంది బయటకు వస్తున్నారన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదన్నారు. ఈ వయస్సులో చంద్రబాబును జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, చన్నీళ్లతో స్నానం చేయించే పరిస్థితి తెప్పించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇంత శాడిజమా? అని ప్రశ్నించారు. ఆయన వయస్సుకు, ఆయన రాజకీయ అనుభవానికి కూడా మర్యాద ఇవ్వడం లేదన్నారు. ఏపీలో కక్ష సాధింపు, రాక్షస పాలన సాగుతోందన్నారు. ఏపీలో రాజన్న పరిపాలన వస్తుందని చెప్పి, అధికారంలోకి వచ్చి రాక్షస పాలన తెచ్చారన్నారు. చంద్రబాబును నంద్యాల నుంచి తీసుకు వెళ్లారు కాబట్టే తాము ఇక్కడే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవాలని నిర్ణయించామన్నారు. తాము చావడానికైనా సిద్ధమే కానీ, దీక్షపై వెనక్కి తగ్గేదే లేదన్నారు. తమకు అనుమతి ఇవ్వకుంటే ఎస్పీ, డీఎస్పీ కార్యాలయాల్లో దీక్ష చేస్తామన్నారు.

Bhuma Akhila Priya
Chandrababu
Telugudesam
YS Jagan
  • Loading...

More Telugu News