Pattabhi: సీఐడీ చీఫ్ తదుపరి మీడియా సమావేశం చంద్రమండలంపై అనుకుంటా!: పట్టాభి

Pattabhi satires on CID Chief Sanjay

  • స్కిల్ వ్యవహారంలో సీఐడీ చీఫ్ పై పట్టాభి ధ్వజం
  • సంజయ్ స్కిల్ కార్పొరేషన్ పుట్టుక అక్రమం అంటున్నారన్న పట్టాభి
  • నీలం సహానీని విచారిస్తే సక్రమమో, అక్రమమో తేలిపోతుందని సలహా
  • దీనిపై చర్చకు రావాలంటూ సవాల్  

స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్ సంజయ్ వ్యవహారశైలిని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తప్పుబట్టారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే అక్రమమంటున్న సీఐడీ చీఫ్ సంజయ్... నీలం సహానీ ఇచ్చిన జీవోలు 47, 48, గవర్న్ మెంట్ ఆఫ్ ఇండియా ఇన్ కార్పొరేషన్ సర్టిఫికెట్ పై ఏం సమాధానం చెబుతాడు? అని ప్రశ్నించారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో రెండు జీవోలు స్వయంగా ఇచ్చి, కీలక భూమిక పోషించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి, నేటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయిన నీలం సహానీని విచారిస్తే సీఐడీ చీఫ్ కు కార్పొరేషన్ పుట్టుక అక్రమమో, సక్రమమో తెలుస్తుందని పట్టాభి స్పష్టం చేశారు. కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు విడుదల చేసిన అజయ్ కల్లంను అడిగినా మీకు మరింత సమాచారం అందచేస్తారని అన్నారు. 

సీఐడీ చీఫ్ సంజయ్ మన రాష్ట్ర రాజధాని, పొరుగు రాష్ట్ర రాజధాని, దేశ రాజధానిలో అబద్ధాలు చెప్పడం అయిపోయింది... ఇక ఆయన తదుపరి మీడియా సమావేశం చంద్రమండలం మీదే అనుకుంటా! అని పట్టాభి వ్యంగ్యం ప్రదర్శించారు. 

టీడీపీ ఎప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల ముందు పెడుతోందని, తాజాగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుక యొక్క వాస్తవాలను ప్రజల ముందు ఉంచామని పట్టాభి తెలిపారు. 

“స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకపై ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ చెప్పిందంతా నూటికి నూరుశాతం పచ్చి అబద్ధం. కార్పొరేషన్ ఏర్పాటు అనేది నిబంధనల ప్రకారం సక్రమంగా జరగలేదని ఆయన వ్యాఖ్యానించడం ముమ్మాటికీ పెద్ద తప్పు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మూలమైన జీవోనెం-47 సీఐడీ చీఫ్ సంజయ్ కు కనిపించడంలేదా? 

ఆ జీవోను ప్రస్తుత ముఖ్యమంత్రిగారికి అత్యంత సన్నిహితురాలైన నీలం సహానీ 10-09-2014న విడుదల చేశారు. గతంలో ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఆమె చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. చీఫ్ సెక్రటరీగా ఆమె పదవీకాలం ముగిశాక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏరికోరి ఆమెను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించారు. జీవో నెం-47లో చాలా స్పష్టంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను ప్రస్తావించారు. 

అలానే సదరు కార్పొరేషన్ కు సీ.ఈ.వో, మేనేజింగ్ డైరెక్టర్లను కూడా నియమిస్తున్నట్టు సదరు జీవో లో పేర్కొనడం జరిగింది. నీలంసహానీ సొంత సంతకంతో ఏర్పాటైన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుట్టుకే అబద్ధమని సీఐడీ చీఫ్ సంజయ్ ఎలా చెబుతారు? ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ను ఆమోదిస్తూ, నీలం సహానీ గారే జీవో నెం-48ను విడుదలచేసింది వాస్తవం కాదా? 

ఏపీ సీఐడీకి నిజంగా ధైర్యముంటే రెండు జీవోలు విడుదలచేసిన నీలం సహానీని ఎందుకు విచారించలేదు? ఆమెను విచారిస్తే ఏ విధంగా ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైందో చాలా స్పష్టంగా సీఐడీకి వివరిస్తారు. కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన జీవోలు ఇచ్చింది శ్రీమతి నీలం సహానీ అయితే, కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన నిధులు కేటాయించింది అజేయ కల్లం. వారి వాంగ్మూలం తీసుకోకుండానే చంద్రబాబు ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు రూల్స్ ప్రకారం జరగలేదని సీఐడీ ఎలా చెబుతోంది? 

టీడీపీ నేడు బయటపెట్టిన జీవోలపై గానీ, గతంలో బయటపెట్టిన 35 డాక్యుమెంట్లపై గానీ బహిరంగచర్చకు వచ్చే దమ్ము, ధైర్యం సీఐడీకి, ముఖ్యమంత్రికి ఉన్నాయా? నీలం సహానీ, అజేయ కల్లం,  ప్రేమచంద్రారెడ్డి... ఇలా స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, దాని అమల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లను సీఐడీ విచారించదు. కానీ చంద్రబాబు తప్పు చేశాడని మాత్రం దుష్ప్రచారం చేస్తుంది. 

ఇక, స్కిల్ వ్యవహారంలో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి ‘ఇదర్ ఆయియే’ వ్యాఖ్యలు విన్నాక హాస్యనటులు కూడా ఆయన ముందు దిగదుడుపేనని అర్థమైంది" అంటూ పట్టాభి ఎద్దేవా చేశారు.

Pattabhi
CID Chief Sanjay
Chandrababu
Skill Development
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News