Rajasthan: కోటాలో ఉసురు తీసుకున్న మరో విద్యార్థి.. ఈ ఏడాది 25వ కేసు

16 year old NEET aspirant dies by suicide in Kota

  • కోటాలో నీట్‌కు శిక్షణ పొందుతున్న రాంచీ బాలిక
  • హాస్టల్ లో ఉరివేసుకుని ఆత్మహత్య
  • హాస్టల్ గదులు, వారుండే చోట సీలింగ్ ఫ్యాన్లు తొలగించినా ఆగని ఆత్మహత్యలు

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు తెరపడడం లేదు. తాజాగా మరో విద్యార్థిని ఉసురు తీసుకుంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 25కు పెరిగింది. నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక తాజాగా ఉరివేసుకుంది. రాంచీకి చెందిన బాధిత విద్యార్థిని నగరంలోని బ్లేజ్ హాస్టల్‌లో ఉంటూ నీట్‌కు శిక్షణ పొందుతోంది.

రాజస్థాన్ పోలీసులు చెబుతున్న దానిని బట్టి 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 21లో ఒక్క విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోలేదు. 

జేఈఈ, నీట్‌కు శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఒత్తిడి కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో హాస్టల్ రూములు, విద్యార్థులు ఉండే పేయింగ్ గెస్ట్ నివాసాల్లో సీలింగ్ ఫ్యాన్లను తొలగించాలని ఆదేశించారు. ఆత్మహత్యల నివారణకు విద్యార్థులకు మానసిక ఆలంబన, భద్రత కల్పించాలని కూడా కోటా జిల్లా కలెక్టర్ ఓం ప్రకాశ్ బంకర్ ఆదేశించారు.

కోటాలో విద్యార్థుల మరణాలు ఆపేందుకు ప్రతిపాదనలు సూచించాలని రాజస్థాన్ హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. విద్యార్థుల మానసిక కౌన్సెలింగ్‌పై దృష్టి  సారించాల్సిన ఆవశ్యకతను కోర్టు నొక్కి చెప్పింది. కోచింగ్ సెంటర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజస్థాన్ కోచింగ్ ఇనిస్టిట్యూట్ (కంట్రోల్ అండ్ రెగ్యులైజేషన్) బిల్లు 2023ని ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తోంది.

Rajasthan
Kota
NEET
JEE
Ranchi Girl
  • Loading...

More Telugu News