Janasena: 'మా మొదటి ఓటు జనసేనకే': క్యాంపెయిన్ పోస్టర్ విడుదల

My First Vote for Janasena campaign poster

  • తెనాలిలోని జనసేన కార్యాలయంలో విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
  • బంగారు భవిష్యత్తు కోసం యువత జనసేనకే ఓటేస్తారన్న నాదెండ్ల
  • ప్రతిపక్షాలపై వైసీపీ దాడులు చేయడంతో పాటు తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపణ
  • ప్రతిపక్షాల సభలు, ర్యాలీలలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే బ్యానర్లు కడుతున్నారని వ్యాఖ్య

తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ గతంలో భీమవరం, విశాఖపట్నంలలో పర్యటించినప్పుడు వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతో పాటు దాడులు చేశారని, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం ఆయన గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ... ప్రతిపక్షాలపై దాడులు చేయడంతో పాటు తప్పుడు కేసులు పెట్టే కొత్త సంప్రదాయానికి వైసీపీ ప్రభుత్వం తెరతీసిందన్నారు. గతంలో జనసేనానిపై, ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలోను వైసీపీ అల్లరి మూకలు అలాగే చేస్తున్నాయని విమర్శించారు. లోకేశ్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతల చర్యలను, పోలీసు కేసులను జనసేన ఖండిస్తోందని చెప్పారు.

ప్రతిపక్షాల సభలు, ర్యాలీలలో వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే బ్యానర్లు కడుతున్నారన్నారు. దీనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. మరో ఆరు నెలలు ఓపికపడితే రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము 'మా మొదటి ఓటు జనసేనకే' అనే నినాదంతో ముందుకు సాగుతామన్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలకమేనని, యువత ఓటు కూడా చాలా కీలకమని నాదెండ్ల అన్నారు. రాష్ట్రంలో 4 లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని, వారు తమ మొదటి ఓటును వినియోగించుకోనున్న తరుణంలో వారిలో చైతన్యం నింపేలా మా మొదటి ఓటు జనసేనకే ప్రచారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వారంతా మొదటి ఓటును వినియోగించుకొని తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి జనసేనకే ఓటేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Janasena
Nadendla Manohar
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News