Eluri Sambasivarao: ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కోసం వైసీపీ ప్రభుత్వం 800 మందితో రెండు వ్యవస్థలు ఏర్పాటు చేసింది: ఏలూరి సాంబశివరావు

TDP MLA Eluri Sambasiva Rao press meet

  • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి ప్రెస్ మీట్
  • వైసీపీ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని వ్యాఖ్యలు
  • అందుకే అర్హుల ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదుకు తెరలేపారని ఆరోపణలు
  • తాడేపల్లి హోటల్, హైదరాబాద్ నుంచి రెండు వ్యవస్థలు నడుస్తున్నాయని వెల్లడి

వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన పాలకులు, మరలా ఎన్ని కుట్రలు కుతంత్రాలైనా పన్ని అధికారంలోకి రావాలని దొంగఓట్ల తంతుకి తెరలేపారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

“రాష్ట్రవ్యాప్తంగా దొంగఓట్లు నమోదు చేయించడంతో పాటు, టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. కుప్పం, ఉరవకొండ, విశాఖపట్నం, పర్చూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రభుత్వం అనేక అక్రమాలకు తెరలేపింది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇష్టానుసారం అర్హుల ఓట్లు తొలగించిన అనేకమంది అధికారులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారనే వాస్తవాన్ని అధికారయంత్రాంగం గ్రహిస్తే మంచిది. 

అర్హుల ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కోసమే వైసీపీ ప్రభుత్వం తాడేపల్లిలోని ఓ హోటల్లో, హైదరాబాద్ లో 800 మందితో రెండు ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేసింది. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వాలంటీర్లతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి, తనకు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని భావించిన ప్రజల ఓట్లు తొలగించేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థనే నిర్వహిస్తున్నాడు. 

తాడేపల్లిలోని శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్లో 400 మంది సిబ్బందితో కూడిన ఒక బృందం, ఒక పారిశ్రామికవేత్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి పనిచేస్తున్న మరో బృందం వాలంటీర్ల సాయంతో టీడీపీ అనుకూల ఓట్లను తొలగించే ఘట్టాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. రిప్రంజటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్- 1956 లోని కొత్త నిబంధనను కాదని, 1950 యాక్ట్ లోని పాత నిబంధనల ప్రకారం, జగన్ ప్రభుత్వం అర్హుల ఓట్లు తీసేస్తోంది. 

ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా సేకరించి, దాని ఆధారంగా  ఒక్కో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులకు చెందిన 10 వేల ఓట్లను తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

ఒకే వ్యక్తి పేరుతో 300, 400 దరఖాస్తులు అప్ లోడ్ చేయిస్తున్నారు. దీనిపై మేం నియోజవర్గ, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఎన్నికల సిబ్బందికి ఫిర్యాదు చేశాం. ఎవరైనా ఒక వ్యక్తి 5కు మించి ఫామ్-7 దరఖాస్తులు అప్ లోడ్ చేస్తే, వాటిని విచారించే అధికారం స్థానిక బీఎల్వోలకు లేదు. వాటిని పరిశీలించి విచారించే అధికారం వీఆర్వోలకు మాత్రమే ఉంది. 

అసలైన, అర్హులైన వారిని ఓటు వేయకుండా చేయాలన్నదే ఈ ప్రభుత్వ కుట్ర. కింది స్థాయి అధికారుల్ని చైతన్యం చేస్తూ, ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘంపైనే ఉంది. రాష్ట్రంలో చొరబడిన ఓట్ల దొంగల్ని ఒక కంట కనిపెట్టి, వారిని కట్టడిచేయడంపై ప్రజలు కూడా అప్రమత్తులై ఉండాలి” అని సాంబశివరావు సూచించారు.

Eluri Sambasivarao
Votes
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News