Pawan Kalyan: ముఖ్యమంత్రి పదవి స్వీకరించేందుకు నేను సిద్ధం... కానీ..: పవన్ కల్యాణ్

Pawan Kalyan ready to chief minister post

  • తన ముఖ్యమంత్రి పదవిని ప్రజలు, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని వ్యాఖ్య
  • జగన్ పక్కా వ్యాపారిలా మారిపోయాడని పవన్ ఆగ్రహం
  • జగన్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపణ
  • 2004 నుండి కొనుగోలు చేసిన భూమి కోసమే విశాఖ వస్తున్నారన్న జనసేనాని
  • బాలికల అదృశ్యం గురించి మాట్లాడితే ఆధారాలు అడుగుతున్నారని ఆవేదన

ముఖ్యమంత్రి పదవి కోసం తాను ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం పదవికి సిద్ధమని తాను పిఠాపురంలో, గాజువాక సభలలో చెప్పానని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను సీఎం పదవికి సిద్ధమని చెప్పినప్పటికీ, మనది ప్రజాస్వామ్య దేశమని, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. తన సీఎం పదవిని ప్రజలు నిర్ణయించాలన్నారు. తాను ఉభయ తెలుగు రాష్ట్రాలలో, తమిళనాడు, కర్ణాటకలలో ప్రభావితం చేయవచ్చునని, కానీ రాజకీయాలు వేరన్నారు. ఓట్లు చీలకూడదనే ఉద్ధేశ్యంతో తాను ఉన్నానని, టీడీపీ, జనసేన పొత్తా? లేక బీజేపీతో వెళ్లడమా? అన్నది చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతామన్నారు.

జగన్ పక్కా వ్యాపారిలా మారిపోయాడని, వైసీపీ వచ్చాక రాష్ట్రంలో క్రిమినాలిటీ వ్యవస్థీకృతమైందని ఆరోపించారు. బ్రిటిష్ వాళ్లలా జగన్ విభజించి పాలిస్తున్నారన్నారు. మైనింగ్ దోపిడీ పెరిగిందని, వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర వనరులు దోచేస్తున్నారన్నారు. లాటరైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. తాడేపల్లిలో నేరాలు పెరిగిపోయాయన్నారు. బాధితులు పోలీసుల వద్దకు వెళ్తే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే నిన్న తన వద్దకు 400 పిటిషన్లు వచ్చాయన్నారు. బాధితులను కేసులు ఉపసంహరించుకోమని పోలీసులే చెప్పడం బాధాకరమన్నారు.

2004 నుండి కొనుగోలు చేసిన భూమి కోసమే విశాఖకు వస్తున్నారని జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఉత్తరాంధ్ర వనరులను దోచేస్తే అడిగేవారు లేరన్నారు. ఉత్తరాంధ్రలో భూదోపిడీ పెరిగిందన్నారు. రాష్ట్రం నేరాలకు నిలయంగా మారిందన్నారు. చిత్తూరులో ఒకేరోజు చాలామంది బాలికలు అదృశ్యమైతే, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారని అడుగుతున్నారని వాపోయారు. అందుకే పోలీస్ స్టేషన్ వరకు రాకముందే తన వద్దకు పెద్ద ఎత్తున పిటిషన్లు వచ్చాయన్నారు. ప్రశ్నిస్తే తల్లిదండ్రుల పెంపకం లోపమని కూడా అంటున్నారన్నారు. రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వం పన్నులమయం చేసిందన్నారు. గ్రీన్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తున్నారన్నారు.

ఉత్తరాంధ్ర ప్రజల్లో చైతన్యం ఉన్నప్పటికీ, కొంతమంది నాయకుల చేతుల్లో ఉండిపోయారన్నారు. మహిళలపై లైంగిక దాడి జరిగితే హోంమంత్రి వచ్చి తల్లిదండ్రుల పెంపకం తప్పు, దొంగతనం చేయడానికి వచ్చి అలా చేశాడని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర భూములు దోపిడీకి గురవుతున్నాయన్నారు. ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మఒడి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారని, ఎంత కరెంట్ వాడుకున్నా ఉచితమని చెప్పి ఇప్పుడు వేల రూపాయల బిల్లులు వేస్తున్నారు. 

తాను 30వేల మంది మహిళలు మిస్సింగ్‌ అయ్యారంటే వైసీపీ వారంతా తనను తిడతారని, ఈరోజు ముగ్గురు అమ్మాయిలు ఒకేరోజు మిస్ అయినట్లు పేపర్లో వార్త వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించడం లేదని, వ్యాపారం చేస్తున్నాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడన్నారు. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదని, మొదటి నుండి వ్యాపారి కాబట్టి అలాగే చేస్తున్నాడన్నారు. అలాగే క్రిమినల్, క్రిమినల్ మైండ్ తో అందరినీ భయపెట్టి దోచుకుంటున్నాడన్నారు. పోలీసులు చూస్తుండగా మత్స్యకారుల బోట్లు తగులబెట్టించాడన్నారు.

Pawan Kalyan
Janasena
YS Jagan
Chief Minister
  • Loading...

More Telugu News