Revanth Reddy: పొత్తులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Revanth Rveddy key comments on alliance

  • తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని విమర్శ
  • కేసీఆర్ తెలంగాణ ద్రోహి అని ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్
  • తాను ఉద్యమం చేసే సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారని వెల్లడి
  • బీజేపీ పరిస్థితి బండి సంజయ్‌ని అడిగితే తెలుస్తుందని వ్యాఖ్య
  • జాతీయస్థాయిలోనే పొత్తులపై చర్చలు ఉంటాయని వెల్లడి 

తెలంగాణకు బీఆర్ఎస్ ఎంతో అన్యాయం చేసిందని, తెలంగాణ ద్రోహి కేసీఆర్ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ నష్టపోవడంలో కేసీఆర్ మొదటి ముద్దాయి అన్నారు. తెలంగాణవాదానికి, కేసీఆర్‌కు ఏమాత్రం సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ మోసం చేసిందన్నా... తెలుగుదేశం మోసం చేసిందన్నా... అందులో కేసీఆర్ కూడా ఉంటారన్నారు. సోనియా గాంధీ సభలో డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. మేం ఏం చేస్తామో త్వరలో చెబుతామన్నారు. మంత్రి కేటీఆర్‌పై కూడా రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాధికి, వ్యాధులకు కేటీఆర్‌కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. తాను ఉద్యమం చేసే సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారన్నారు.

తెలంగాణకు ద్రోహం చేస్తే ఉరి తీయడం, పిండం పెట్టడం తెలంగాణ సంస్కృతి అన్నారు. తెలంగాణ పదమే ఇష్టం లేక పార్టీ పేరు మార్చుకున్న కేసీఆర్‌కు తెలంగాణకు ఏం సంబంధమన్నారు. కేసీఆర్, నరేంద్ర మోదీ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయ్యాక పార్టీ పరిస్థితి ఏమిటో బండి సంజయ్‌ని అడిగితే బాగా చెప్తారన్నారు. ప్రజా కోర్టు తెలంగాణ కాంగ్రెస్ థీమ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోను సోనియాగాంధీ విడుదల చేస్తారని, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే సభలో ఖర్గే పాల్గొంటారన్నారు.

పొత్తుల అంశంపైనా రేవంత్ స్పందించారు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై చర్చిస్తామన్నారు. ఇప్పుడు ఎలాంటి చర్చలు లేవన్నారు. జాతీయస్థాయిలోనే పొత్తులపై చర్చలు ఉంటాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మారుస్తామన్నారు. ఏ పదవి లేకుండా ప్రజల కోసం అన్ని దశాబ్దాలు కొట్లాడిన వారు గద్దర్ మాత్రమే అన్నారు. గద్దర్ పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని, ట్యాంక్‌బండ్‌‌పై గద్దర్ విగ్రహం పెడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కవులు, కళాకారులకు ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు.

  • Loading...

More Telugu News