Somireddy Chandra Mohan Reddy: ఆదాల ఆరోసారి పార్టీ మారి రికార్డు సృష్టించబోతున్నారు: సోమిరెడ్డి వ్యంగ్యం

Somireddy slams YCP MP Adala Prabhakar Reddy

  • నెల్లూరు జిల్లాలో ఎంపీ ఆదాల, సోమిరెడ్డి మధ్య మాటల యుద్ధం
  • సోమిరెడ్డి వల్లే జిల్లాలో టీడీపీ నాశనం అయిందన్న ఆదాల
  • 2004లో పార్టీ నేతలందరినీ సోమిరెడ్డి తరిమేశాడని ఆరోపణ
  • ఆరోసారి కూడా ఓడిపోతే సోమిరెడ్డికి అవార్డు ఇస్తామని వ్యంగ్యం
  • పార్టీలు మారడం ఆదాలకు అలవాటేనన్న సోమిరెడ్డి
  • పీకే టీమ్ నివేదిక వ్యతిరేకంగా వచ్చినట్టుందని ఎద్దేవా

నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వల్లే నెల్లూరు జిల్లాలో టీడీపీ సర్వనాశనం అయిందని, టీడీపీ నుంచి అందరూ వెళ్లిపోవడానికి సోమిరెడ్డే కారణమని ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో తాను తప్ప ఇంకెవరూ ఉండకూడదన్న మనస్తత్వం కలిగిన వ్యక్తి సోమిరెడ్డి అని, పార్టీ నుంచి ఇతరులను తరిమేయడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. 

సోమిరెడ్డి ఇప్పటిదాకా నెల్లూరు జిల్లాలో ఐదుసార్లు ఓడిపోయారని, సోమిరెడ్డిని తానే రెండుసార్లు ఓడించినట్టు ఆదాల వెల్లడించారు. సోమిరెడ్డి ఈసారి కూడా ఓడిపోతే ఆరోసారి అవుతుందని, దాన్ని జాతీయస్థాయిలో ఓ రికార్డుగా భావించి ఆయనకు అవార్డు ఇస్తామని ఎద్దేవా చేశారు. 

దీనిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. పార్టీలు మారడం ఎంపీ ఆదాలకు అలవాటేనని అన్నారు. పీకే టీమ్ ఆదాలపై వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారేమో అని వ్యాఖ్యానించారు. అందుకే పార్టీ  మారేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోందని, ఇప్పుడు ఆరోసారి పార్టీ మారి రికార్డు సృష్టించబోతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఎన్నికల ముందు సర్వేలు చేయించుకోవడం, పార్టీలు మారడం, కాంట్రాక్టులు తీసుకోవడం ఆదాలకు కొత్తేమీ కాదని సోమిరెడ్డి పేర్కొన్నారు. తాను నేతలను పార్టీ నుంచి తరిమేస్తానని ఆదాల చెబుతున్నాడని, తరిమేస్తే వెళ్లడానికి వాళ్లేమీ గొర్రెలు, మేకలు కాదు కదా అని అన్నారు.

Somireddy Chandra Mohan Reddy
Adala Prabhakar Reddy
TDP
YSRCP
Nellore District
  • Loading...

More Telugu News