Hyderabad: మూడేళ్ల కొడుకుకు ఉరి వేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డ గర్భిణి

Woman commits suicide along with son in Filmnagar

  • హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో విషాదం
  • అత్తింటి వేధింపులే కారణమని ఆరోపణలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

అత్తింటి వేధింపులు తట్టుకోలేక మూడేళ్ల కొడుకుతో పాటు ఆత్మహత్య చేసుకుందో గృహిణి. కడుపున పుట్టిన బిడ్డతో పాటు కడుపులో మోస్తున్న మరో బిడ్డతో బలవన్మరణానికి పాల్పడింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో శుక్రవారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఫిల్మ్ నగర్ లో నివాసం ఉంటున్న విశ్వనాథ్, శిరీషలకు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. మూడేళ్ల కిందట కొడుకు పుట్టగా.. మనీష్ అని నామకరణం చేసి శిరీష అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. ఏం జరిగిందో ఏమో కానీ శుక్రవారం రాత్రి ఇంట్లోని ఓ గదిలో శిరీష, మనీష్ ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు. భార్య, కొడుకులను కాపాడేందుకు ప్రయత్నించినా ఉపయోగంలేకుండా పోయిందని విశ్వనాథ్ తెలిపారు. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

పెళ్లైన నాటి నుంచే తమ కూతురును అత్తింటి వారు నానా కష్టాలు పెట్టారని శిరీష తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మనీష్ పుట్టాక వేధింపులు పెరిగాయని, ప్రస్తుతం శిరీష మళ్లీ గర్భం దాల్చిందని తెలిసి మరింతగా ఎక్కువగా వేధించారని చెప్పారు. వేధింపులు భరించలేక తమ కూతురు ఈ కఠిన నిర్ణయం తీసుకుందని కన్నీటిపర్యంతమయ్యారు. శిరీష అత్తింటి వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు.

Hyderabad
Filmnagar
women suicide
kid hanged
Crime News
Telangana
  • Loading...

More Telugu News