Tirumala: తిరుమలలో కాలినడక దారిలో చిరుత దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

leapard attack 4 year old boy in tirumala boy rescued

  • గురువారం తిరుమలకు తమ కుమారుడితో(4) కాలినడకన బయలుదేరిన కర్నూలు దంపతులు
  • ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం చేసేందుకు ఆగిన వైనం
  • అక్కడే ఆడుకుంటున్న బాలుడిని నోట కరిచి ఎత్తుకెళ్లిపోయిన చిరుత
  • చిరుతను వెంబడించిన స్థానికులు, తల్లిదండ్రులు
  • బాలుడిని పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద వదిలివెళ్లిపోయిన చిరుత
  • గాయాలపాలైన బాలుడికి ఆసుపత్రిలో చికిత్స, ప్రాణాపాయం లేదన్న వైద్యులు

తిరుమల-అలిపిరి నడక దారిలో గురువారం జరిగిన చిరుత దాడిలో ఓ నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో బాలుడికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కర్నూలు జిల్లా అదోనికి చెందిన దంపతులు తమ కుమారుడు కౌశిక్(4)ను తీసుకుని నడక దారిలో తిరుమలకు బయలుదేరారు. ఆ తరువాత మొదటి ఘాట్ రోడ్డులోని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భోజనం కోసం ఆగారు. బాలుడేమో ఆ పక్కనే ఆడుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి వచ్చిన ఓ చిరుత బాలుడిని నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. 

దీంతో, స్థానికులు, భద్రతాసిబ్బంది, తల్లిదండ్రులు పెద్దపెట్టున కేకలు వేస్తూ చిరుతను వెంబడించారు. టార్చిలైట్లు, వేస్తూ రాళ్లు రువ్వుతూ, కేకలు వేస్తూ చిరుతను బెదిరించారు. దీంతో, కంగారు పడ్డ చిరుత బాలుడిని పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద వదిలేసి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారి చెవి వెనుక భాగం, తలపై పలు చోట్ల గాయాలను వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. బాలుడి ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

Tirumala
Andhra Pradesh
Kurnool District
  • Loading...

More Telugu News