Jairam Ramesh: ఎయిర్ పోర్టులో అధికారి పట్ల మోదీ తీవ్ర అసహనం... వీడియో పంచుకున్న జైరాం రమేశ్

Jairam Ramesh shares PM Modi video

  • ముగిసిన ప్రధాని మోదీ విదేశీ పర్యటన
  • ఢిల్లీలో విమానం దిగి వస్తుండగా ఎదురొచ్చిన అధికారి
  • వెనక్కి వెళ్లాలంటూ అసహనం వెలిబుచ్చిన మోదీ
  • వీడియో వైరల్

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే విమానం దిగి వస్తుండగా, ఓ అధికారి పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేయడం వీడియోలో రికార్డయింది. 

మోదీ నడుచుకుంటూ వస్తుండగా, ఆ అధికారి నమస్కారం చేస్తూ మోదీకి సమీపానికి వెళ్లారు. దాంతో ఆగిపోయిన మోదీ... వెనక్కి వెళ్లాలని ఆ అధికారికి సూచించారు. మోదీ ఏం చెబుతున్నారో ఆ అధికారికి అర్థం కాకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దాంతో మోదీ మరింత అసహనానికి లోనయ్యారు. బాగా వెనక్కి వెళ్లు అంటూ చేతులు ఊపుతూ సంజ్ఞలు చేశారు. 

అక్కడున్న ఇతరులు ఆ అధికారిని వెనక్కి వచ్చి నిలుచోవాలని సూచించారు. ఆ వ్యక్తి వెనక్కి వచ్చి నిలుచోవడంతో, అప్పుడు మోదీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు కదిలారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 

కాంగ్రెస్ ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ వీడియోపై విమర్శనాత్మకంగా స్పందించారు. "కొరియోగ్రఫీకి గురువు అనదగ్గ వ్యక్తి (మోదీ) ఏం చేశాడో చూడండి" అంటూ ఆ వీడియోను రీట్వీట్ చేశారు. 

ప్రతి చోటా అందరి దృష్టి తనపై ఉండేలా చూసుకోవడంలో మోదీ దిట్ట అని, తాను తప్ప ఇంకెవరూ కనిపించకూడదని భావిస్తుంటారని విపక్ష నేతలు ప్రధానిపై విమర్శలు చేస్తుండడం తెలిసిందే.

Jairam Ramesh
Narendra Modi
Airport
Delhi
Congress
BJP
India

More Telugu News