Andhra Pradesh: ప్రకాశం జిల్లాలో వివాహిత దారుణ హత్య.. కిరాతకంగా హత్యచేసిన దుండగులు!

Dreaded murder in Prakasam Dist

  • వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు శివారులో ఘటన
  • రూ. 50 లక్షలు అప్పు తీసుకున్న వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న బాధితురాలి తండ్రి  
  • వారం రోజుల క్రితం సొంతూరికి వచ్చిన వివాహిత

ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం జిల్లెళ్లపాడు శివారులో గత రాత్రి దారుణ హత్య జరిగింది. ఓ వివాహితను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. తమ కుమార్తె కోట రాధ (35) కనిపించడం లేదంటూ ఆమె తండ్రి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె మృతదేహం జిల్లెళ్లపాడు సమీపంలో రోడ్డు పక్కన లభ్యమైంది.

నిందితులు తొలుత రాధ కాళ్లపై నుంచి కారును పోనిచ్చారు. దీంతో కదల్లేని స్థితికి చేరిన ఆమె గుండెలపైనుంచి కారును నడిపారు. ఆ తర్వాత కూడా ఎక్కడ బతుకుతుందోనన్న అనుమానంతో ముఖంపై బండరాయితో మోది క్రూరంగా హత్య చేసినట్టు అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. అంతకుముందు ఆమెను కొంతదూరం ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యలో నలుగురైదుగురు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు.

వెలిగండ్ల మండలం గుండ్లోపల్లికి చెందిన కేతిరెడ్డి కాశిరెడ్డికి తన కుమార్తె, అల్లుడు రూ. 50 లక్షలు అప్పు ఇచ్చారని, ఆయనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని రాధ తల్లిదండ్రులు సుబ్బలక్ష్మి, సుధాకర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇస్తామని పిలిపించి ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. 

కాగా, సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన రాధ భర్త మోహన్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామంలో చౌడేశ్వరిదేవి కొలుపులు ఉండడంతో ఈ నెల 11న వచ్చిన రాధ అంతలోనే దారుణ హత్యకు గురి కావడం సంచలనమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News