China: జనాభా పెంచుకునేందుకు చైనా కొత్త కార్యక్రమం

China new policy to increase population

  • 1980 నుంచి 2015 వరకు చైనాలో వన్ చైల్డ్ పాలసీ
  • 60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన జననాల రేటు
  • కొత్త తరం జనాభా సంఖ్యను పెంచడంపై చైనా దృష్టి
  • జనాభా పెంపుదల కోసం పలు ప్రోత్సాహాలతో ప్రాజెక్టు

ఇటీవలి వరకు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగివున్న చైనా ఇప్పుడు భారత్ తర్వాత రెండో స్థానంలో ఉంది. అయితే, చైనాలో మళ్లీ జనాభాను బాగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత 60 ఏళ్ల కాలంలో తొలిసారిగా చైనాలో జననాల రేటు పడిపోవడమే అందుకు కారణం. 

ఈ నేపథ్యంలో, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి అంటూ చైనా ప్రభుత్వం ప్రచారం చేయాలని నిర్ణయించింది. 'కొత్త తరం' పేరిట దేశంలోని 20 నగరాల్లో ఈ ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులో భాగంగా... యువతీయువకులు పెళ్లీడుకు రాగానే పెళ్లిళ్లు చేసుకోవడం, పెళ్లికుమార్తెలకు చెల్లించే అధిక కట్నాలను అడ్డుకోవడం, పిల్లలు కన్నాక వారి బాధ్యతలను తల్లిదండ్రులు ఇరువురూ పంచుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. దేశంలో సంతానోత్పత్తి రేటు పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 

ఒకప్పుడు ప్రపంచంలో అందరికంటే ముందు 100 కోట్ల జనాభా మార్కు అందుకున్న చైనా... జనాభాను కట్టడి చేసేందుకు 1980 నుంచి 2015 వరకు కఠిన విధానం అవలంబించింది. వన్ చైల్డ్ పాలసీ తీసుకువచ్చి, ఒక్క బిడ్డనే కనాలని హుకుం జారీ చేసింది. దాంతో జననాల రేటు తగ్గిపోయింది. దేశంలో వృద్ధుల సంఖ్యతో పోల్చితే యువత సంఖ్య పడిపోయింది. 

అందుకే యువత సంఖ్యను పెంచుకునేందుకు తాజాగా చైనా జనాభా పెంపు చర్యలకు ఉపక్రమించింది. చైనా ప్రభుత్వ ఆలోచనా విధానం ఇలా ఉంటే, జీవనవ్యయం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, తాము అధిక సంతానాన్ని కనలేమని అక్కడి మహిళలు అంటున్నారు. 

దాంతో చైనా ప్రభుత్వం పలు తాయిలాలు ప్రకటిస్తోంది. మూడో బిడ్డను కంటే చదువుకయ్యే ఖర్చులో రాయితీ ఇస్తామని, ఇంటి నిర్మాణాలకు సబ్సిడీతో రుణాలు, పన్నుల చెల్లింపులతో వెసులుబాట్లు వంటి ఆకర్షణీయ పథకాలను ప్రకటిస్తోంది.

China
Population
New Era Project
Youth
One Child
  • Loading...

More Telugu News