Pawan Kalyan: బీజేపీ నేత సురేశ్ పట్ల కావలిలో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు దారుణం: పవన్

Pawan Kalyan condemns Kavali incident

  • నిన్న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ సభ
  • నిరసన తెలిపేందుకు యత్నించిన బీజేపీ నేతలు
  • కఠినంగా వ్యవహరించిన పోలీసులు
  • ఓ బీజేపీ నేత మెడను కాళ్ల మధ్య ఇరికించి నలిపివేసే ప్రయత్నం చేసిన పోలీసు అధికారి
  • వైరల్ అవుతున్న ఫొటో
  • ఈ ఘటనను ఖండిస్తున్నామన్న పవన్ కల్యాణ్

ఏపీ సీఎం జగన్ శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి వచ్చిన సందర్భంగా బీజేపీ నేతలు నిరసన తెలిపేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. బీజేపీ ఓబీసీ మోర్చా నేత సురేశ్ మెడను ఓ పోలీస్ అధికారి తన కాళ్ల మధ్య ఇరికించి నలిపివేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఈ ఘటన పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. నిరసన గళాలు అణచివేస్తాం... కాళ్ల కింద పడేసి తొక్కుతాం అంటే అది నియంతృత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఏపీ ఉపాధ్యక్షుడు మొగరాల సురేశ్ పట్ల కావలిలో పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు పాలకుల మనస్తత్వానికి అద్దం పడుతోందని పవన్ కల్యాణ్ విమర్శించారు. 

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ అణచివేత చర్యలను ఖండిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిపై సురేశ్ చేస్తున్న నిరసనకు అండగా ఉంటామని వెల్లడించారు.

Pawan Kalyan
Mogarala Suresh
BJP
Police
Kavali
CM Jagan
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News