Odisha: అన్నం లేకుండా కూర ఒక్కటే వండిందని భార్య హత్య

Man kills wife for making only curry without rice in Odisha

  • ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
  • కూర ఒక్కటే వండిన భార్యతో గొడవపెట్టుకున్న భర్త
  • విచక్షణ మరిచి ఆమెను కొట్టడంతో మహిళ మృతి
  • అచేతనంగా పడి ఉన్న తల్లిని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చిన కుమారుడు
  • నిందితుడి అరెస్ట్, హత్యానేరం కింద కేసు నమోదు 

భార్య అన్నం వండకుండా కూర ఒక్కటే రెడీ చేసిందన్న కోపంలో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి ఆమెను అంతమొందించాడు. ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లా నువాధీ గ్రామంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సనాతన్ ధారువాకు(40) భార్య పుష్ప(35), ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కూతురు పనిమనిషిగా చేస్తుంటుంది. కాగా, ఆదివారం వారి కుమారుడు తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ రాత్రి ఇంటికి వచ్చిన సనాతన్, తన భార్య కూర మాత్రమే వండిన విషయాన్ని గుర్తించి ఆమెతో తగవుకు దిగాడు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరుకోవడంతో విచక్షణ కోల్పోయిన సనాతన్ తన భార్యపై ఇష్టారీతిన చేయిచేసుకున్నాడు. దీంతో, ఆమె కుప్పకూలిపోయి మరణించింది. 

ఆ తరువాత ఇంటికి వచ్చిన కుమారుడు తన తల్లి అచేతనంగా పడి ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పోస్ట్‌మార్టం అనంతరం నిందితుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News