Kanimozhi: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై క్షమాపణ చెప్పాల్సిందే: కనిమొళి

Kanimozhi demands apology from Annamalai

  • తమిళనాడు రాష్ట్ర గీతాన్ని అన్నామలై అవమానించారన్న కనిమొళి
  • రాష్ట్ర గీతాన్ని అవమానించిన బీజేపీ నేతలను నిలువరించలేదని విమర్శ
  • జాతీయ గీతాన్ని స్టాలిన్ అవమానించారన్న అన్నామలై

తమిళ రాష్ట్ర గీతాన్ని అవమానించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్ చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళ రాష్ట్ర గీతాన్ని అవమానించారని విమర్శించారు. తమిళ రాష్ట్ర గీతాన్ని అవమానిస్తున్న బీజేపీ నేతలను నిలువరించలేని వ్యక్తి తమిళ ప్రజలను పట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు అన్నామలై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కనిమొళి వ్యాఖ్యలపై అన్నామలై స్పందిస్తూ.. స్టాలిన్ కు సంబంధించిన ఒక పాత వీడియోను షేర్ చేశారు. గతంలో స్టాలిన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు... ఒక కార్యక్రమంలో జాతీయగీతాన్ని ఎగురవేశారు. అయితే ఆ తర్వాత జాతీయగీతాన్ని మాత్రం ప్లే చేయలేదు. జాతీయగీతం పాడలేని నాయకుడు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. తమిళ రాష్ట్ర గీతం నుంచి కన్నడ, తెలుంగు, మలయాళముమ్, తుళువుమ్ పదాలు ఉన్న లైన్ ను తొలగించిన చరిత్ర డీఎంకేది కాదా? అని ప్రశ్నించారు. డీఎంకే చీప్ పాలిటిక్స్ నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. 

ఈ వివాదానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే... శివమొగ్గలో బీజేపీ ఎన్నికల సభలో తమిళ రాష్ట్ర గీతాన్ని ప్లే చేశారు. అయితే మధ్యలోనే ఆ గీతాన్ని ఆపేశారు. కర్ణాటక రాష్ట్ర గీతాన్ని ప్లే చేయాలని బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప అన్నారు. ఇదంతా అన్నామలై సమక్షంలోనే జరిగింది. దీని గురించే అన్నామలైపై కనిమొళి విమర్శలు గుప్పించారు.

Kanimozhi
DMK
Stalin
Annamalai
BJP
  • Loading...

More Telugu News