TDP: తాడేపల్లి ప్యాలెస్ కూల్చడానికి ఒక్క నిమిషం చాలదా?.. చంద్రబాబు వ్యాఖ్య

Chandrababu lashes out at YSRCP in Zone1 party meeting in vizag

  • విశాఖలో టీడీపీ జోన్-1 సమీక్షా సమావేశం
  • పార్టీ అధినేత చంద్రబాబు సహా కీలక నేతల హాజరు
  • అధికార పార్టీపై నిప్పులు చెరిగిన బాబు
  • ఇటీవలి ఎన్నికలు సీఎం జగన్‌కు గుణపాఠమని వ్యాఖ్య

టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు.  విశాఖలోని వి.కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న తెలుగుదేశంలో జోన్ -1 సమీక్షా సమావేశంలో పాల్గొన్న అధికార పార్టీపై ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో ఎస్సీలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని కేసులతో వేధిస్తున్నారని, నేతల ఇళ్లపైకి ప్రోక్లెయిన్లు పంపిస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి ఈ అధికారం ఎవరిచ్చారని మండిపడ్డ బాబు, తాడేపల్లి ప్యాలెస్ కూల్చడానికి ఒక్క నిమిషం చాలదా? అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇంచార్జ్‌లు, ఇతర కీలకనేతలు, పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. 

పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘విశాఖ జోన్ సమావేశం సక్సెస్ అయ్యింది. ఉత్సాహంగా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్పందన చూస్తే అర్థం అవుతుంది...వచ్చే ఎన్నికల్లో గెలిచేది తెలుగు దేశం పార్టీనే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చింది శాంపిల్ గెలుపు మాత్రమే. వచ్చే ఎన్నికల్లో పెద్ద విజయం ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 20 రోజుల ముందు అభ్యర్థిని ప్రకటించినా ప్రజలు మద్దతు పలికి గెలిపించారు. ఒక గెలుపు విజయం ఇస్తుంది...ఒక గెలుపు కుంగదీస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు పార్టీకీ జోష్‌ను ఇచ్చింది. వైసీపీ అంటున్నట్లు వై నాట్ 175 కాదు...ఇప్పుడు చెపుతున్నా వై నాట్ పులివెందుల. 

ఎప్పుడు కూడా మనిషి అనేవాడు భూమి మీద నడవాలి..కానీ జగన్ ఆకాశంలో నడిచాడు. పరదాల చాటున నడిచాడు. నాకు అడ్డం లేదు అనుకున్నాడు. అడ్డదారులు తొక్కాడు. తెలుగు దేశంతో పెట్టుకున్న జగన్ ను చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతారు. పార్టీ ఎమ్మెల్యేలను జగన్ నిన్నటి వరకు హీనంగా చూశాడు..ఇప్పుడు వారికి గౌరవం ఇస్తాను అంటున్నాడు. మనకు గత ఎన్నికల్లో 23 సీట్లు వస్తే ఇది దేవుడి స్క్రిప్ట్ అని హేళన చేశాడు. అందుకే దేవుడి ఆ స్క్రిప్ట్ తిరగరాశాడు. 23వ సంవత్సరం...23 వ తేదీ 23 ఓట్లతో మన ఎమ్మెల్సీ గెలిచారు. ఇదీ దేవుడి స్క్రిప్ట్. రాజకీయ పార్టీలపై కేసులు పెట్టడం, శుక్రవారం వస్తే ప్రజల ఆస్తుల మీదకు ప్రొక్లైనర్లు పంపడం చేశాడు. ఎవరిచ్చారు నీకీ అధికారమని అడుగుతున్నా. నువ్వు ఇలా చేస్తున్నప్పుడు నువ్వు కట్టిన  తాడేపల్లి ప్యాలెస్ కూల్చడానికి ఎంతటైం పడుతుంది? ఒక్క నిమిషం చాలదా అని అడుగుతున్నా.

తప్పుడు పనులు చేసిన జగన్ కు మొన్నటి ఎన్నికలు గుణపాఠం. మొన్నటి వరకు 80 మంది ఎమ్మెల్యే లను తీసేస్తాను అన్నాడు...ఇప్పుడు బాబ్బాబు అంటున్నాడు. జగన్ కు వెన్నెముకలో వణుకు పుట్టింది. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచే పార్టీ టీడీపీ అని తెలిసిపోయింది. అందుకే జగన్ లో వణుకు. మనల్ని అవహేళన చేసిన వారికి మైండ్ బ్లాక్ అయ్యింది. మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చిన తీర్పుకు కూడా జగన్ వక్రభాష్యం చెప్పాడు. ఓటమిని ఒప్పుకోని మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్. ప్రజలను బటన్ బ్యాచ్ అని జగన్ ప్రజలను అవమానించారు. ప్రజల డబ్బులు ప్రజలకు పంచి లబ్దిదారులను బటన్ బ్యాచ్ అని అన్నాడు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రజల్లో చైతన్యం తెచ్చాం. 

జగన్ ఇక ఏ ఎన్నికల్లో గెలవడు....ప్రజా జీవితానికి జగన్ అనర్హుడు. తెలుగు దేశం దేశంలో చక్రం తిప్పిన పార్టీ. నాడు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసిన ఘనత ఉన్న పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీ సాధించిన ఘనత అది. తెలుగు దేశం పార్టీ లేకుండా చేయడం నీవల్ల కాదు. ఒంటిమిట్ట శ్రీరాముడి పెళ్లికి ముఖ్యమంత్రి ఎందుకు వెళ్లలేదు? నాకు నచ్చిన నగరం విశాఖ పట్నం. నీతి నిజాయితీ ఉన్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర ప్రజలే ఎన్నికల్లో కర్రు కాల్చి జగన్ కు వాత పెట్టారు. హుద్ హుద్ వచ్చినప్పుడు ఇక్కడే మకాం వేసి సాయం అందేలా చేశా. తిత్లీ వస్తే...ఆ ప్రాంతం కోలుకున్న తరువాతనే అక్కడ నుంచి వెళ్లాను. నాలుగేళ్లు అయ్యింది....ఈ జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశాడు చెప్పగలడా? ఒక్క పని చేయని జగన్ ను ఉత్తరాంధ్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించాలి. 

టీడీపీ గెలిచి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం పూర్తి అయ్యేవి. వంశధార, నాగావళి అనుసంధానం పూర్తి అయ్యి ఉంటే ఈ మూడు జిల్లాల్లో నీటి ఎద్దడి లేకుండా ఉండేది. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ పై 1600 కోట్లు ఖర్చు పెడితే...ఈ ప్రభుత్వం కనీసం 400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. నాడు తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణ ఇప్పుడు దేశంలో పర్ క్యాపిటా ఇన్ కంలో టాప్ లో చేరింది. తెలంగాణ అలా ముందుకు వెళుతుంటే...ఏపీ మాత్రం అప్పుల్లో మునిగిపోయింది. జగన్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ వ్యవస్థను కూడా నాశనం చేసింది. రాష్ట్రానికే తలమానికం అయిన గీతం విద్యాసంస్థను కూల్చడానికి జగన్ ప్రొక్లెయిన్ తీసుకుని వెళ్లాడు. విశాఖలో ఐఐఎం పెట్టాం, ట్రైబల్ యూనివర్సిటీ కేటాయించాం. కానీ ఈ సిఎం రంగులు వేసుకోవడం తప్ప ఏమీ చేయడం లేదు. 

మనం నాటిన చెట్లకు రంగులేసుకున్న చీప్ నేతలు వైసీపీ నేతలు. రిషికొండకు గుండు కోట్టేశారు ఈ వైసీపీ నేతలు. రిషికొండకు మనం వెళతాం అని ప్రభుత్వం భయపడుతుంది. మనం వెళ్లకుండా అడ్డుపడుతుంది. రఘరామ రెడ్డి అనే ఐపిఎస్ అధికారి ఆదేశాలతో అడ్డంకులు సృష్టించారు. వీళ్లు మూల్యం చెల్లిస్తారు. నాడు భోగాపురం విమాశ్రయం కోసం 97 శాతం భూ సేకరణ పూర్తి చేశాం. నాలుగేళ్లు అయ్యింది జగన్ ఒక్క ఇటుక వెయ్యలేదు. మళ్లీ టీడీపీ వస్తుంది....భోగాపురం పూర్తి చేస్తుంది.  నాడు విశాఖలో మెడ్ టెక్ జోన్ తీసుకువచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ కంపెనీ నీ తెస్తే దాన్నీ ఈ ప్రభుత్వం తరిమేసింది. 

విశాఖ ఒక సుందరమైన నగరం. దీన్ని ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా చేయాలని ప్రయత్నం చేశాం. విశాఖలో 5 ఏళ్లలో మూడు సార్లు సిఐఐ సదస్సులు పెట్టాం. 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నాం. వైసీపీ ఈ నాలుగేళ్లలో ఒక్క చిన్న కార్యక్రమం కూడా చేయని చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పోలవరం ముంపు బాధితులకు డబ్బులు ఇవ్వలేదు, మహేంద్ర తనయ ఆఫ్ షోర్ ప్రాజెక్టును జగన్ పూర్తి చెయ్యలేదు. ఆశోక్ గజపతి రాజు కుటుంబం ప్రజలకు భూములు ఇచ్చారు. మన్సాస్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేశారు. అలాంటి వ్యక్తిని సింహాచలం ట్రస్ట్ చైర్మన్ పోస్టునుంచి దించేశారు. ఆశోక్ గజపతి రాజును అవమానించారు. అవినీతి ఆరోపణలు చేశారు. అనేక అడ్డంకులు సృష్టించారు. ఏజెన్సీ ప్రాంతంలో జీవో నెంబర్ 3 ద్వారా స్థానిక గిరుజనులకే ఉద్యోగాలు అనే ఉత్తర్వు ఇప్పుడు పోయింది. దీనిపై వచ్చిన న్యాయపరమైన సమస్యల్లో ప్రభుత్వం పోరాడ లేదు. 

నాడు గిరిజన ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్ లు కూడా పెట్టాం. ఇప్పుడు అవన్నీ అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో అడవిలోనే కాన్పులు జరుగుతున్నాయి. ఏజెన్సీ ఏరియాలో వివిధ ఆంక్షలలో ప్రభుత్వ పథకాలు గిరిజనులు అందకుండా కొత్త జీవో తీసుకువచ్చారు. 10 ఎకరాల పొలం ఉండకూడదు.....ఆటో ఉంటే కూడా సంక్షేమ పథకం రాదు అనే నిబంధనలతో ఇబ్బందులు పెట్టారు. ఏజెన్సీ నుంచి దొంగ దారిన లేటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి తీసుకువెళుతున్నారు. రాష్ట్రంలో మద్య పాన నిషేదం చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు.  రాష్ట్రంలో నాణ్యత లేని మద్యం, నెంబర్ 2 మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. పేద వర్గాలను జలగల్లా పీలుస్తున్న సిఎం జగన్. నాడు మద్య పాన నిషేదం చేస్తాను అని ఇప్పుడు జగన్ మాట మార్చాడా లేదా? జగన్ ది నోరా...లేక...ఏమనాలి? వివేకా హత్య జరిగితే నారాసుర రక్త చరిత్ర అని మనపై ఆరోపణలు చేశాడు. ఇప్పుడు గూగుల్ టేకవుట్ ద్వారా మొత్తం బండారం బయట పడింది. 

ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక దొరుకుతుందా....రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిపిస్తున్నారు. జిల్లాకు నెలకు రూ.25 కోట్లు టార్గెట్ పెట్టి ఇసుకపై అవినీతికి పాల్పడుతున్నారు. ఒక్క విశాఖపట్నంలోనే రూ. 40 వేల కోట్లు ఆస్తులు వైసీపీ నేతలు రాయించుకున్నారు. బెదిరించి, గన్ పెట్టి ప్రజల ఆస్తులు రాయించుకున్నారు. కార్తీక వనం ఏమయ్యింది....ప్రేమ సమాజం భూములు ఏమయ్యాయి...దసపల్లా భూములుఏమయ్యి....హైగ్రీవ భూములు ఏమయ్యాయి. విశాఖలో రూ. 40 వేల కోట్ల విలువైన భూములు వైసీపీ నేతలు కొట్టేశారు. రేపు తెలుగు దేశం వచ్చిన తరువాత సిట్ ఏర్పాటు చేసి లాక్కున్న భూములు అన్నీ తిరిగి ఇప్పిస్తాం. జగన్ రెడ్డీ నీ బంధువు అనీల్ రెడ్డికి విశాఖలో ఏంపని...ఇక్కడ ఓవ్యక్తికి చెందిన 50 ఎకరాల భూమి కొట్టేశాడు. 14 ఏళ్లు సిఎంగా ఉన్నాను నేను...కానీ విశాఖలో చిన్న ఇల్లు కట్టుకోలేదు. విశాఖలో మా హయాంలో ఎప్పుడూ భూ కబ్జాలు లేవు. జగన్ ఇక్కడి ఆస్తులు అన్ని కావాలి. 

22 ఎ పేరుతో భూములను కాజేస్తున్నారు. ఆ నిబంధన పెట్టి సెటిల్మెంట్లు చేసుకున్నారు. ధర్మాన ప్రసాద రావు....బొత్స ఏం మాట్లాడుతారో అర్థం అవుతుందా....మన దగ్గర కార్పొరేటర్ గాపని చేసిన ఒకాయన ఏం మాట్లాడుతాడు...పెట్టుబడులు అంటే కోడి గుడ్డు అంటాడు.  రాష్ట్రంలో నేడు గంజాయి కల్చర్, గన్ కల్చర్ వచ్చింది అంటే మనం సిగ్గు పడాలి. తెలుగు దేశం పార్టీ వెన్నెముక బిసిలు. ఆలాంటి బిసిలు ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర. నిజాయితీ పరులు ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర. నాడు దేశంలో ఒక్క యూనిట్ విద్యుత్ చౌర్యం లేకుండా రికార్డు సృష్టించిన ప్రాంతం ఉత్తరాంధ్ర. రాష్ట్రంలో నిత్యావసరాలు పెరిగాయి. అన్ని పన్నులు పెరిగాయి. విద్యుత్ చార్జీలు పదే పదే పెంచుతున్నారు. దీనిపై చేపట్టిన నిరసనలను విజయవంతం చేయండి. 

పెట్రోల్ డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల కంటే ఎపిలోనే ఎక్కువ. ఆర్టీసీ రేట్లు, ఇంటిపన్నులు పెంచారు....చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్రంలో కొత్త తరహా మద్యం బ్రాండ్స్ వచ్చాయి. బూమ్ బూమ్ అనే బీర్లు వచ్చాయి. ఇవన్నీ ఏంటో తెలీదు. నాణ్యత లేని మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారు. పన్నులు వేశారు. ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క పరిశ్రమ తేలేదు. మరి ఆ నిధులు అన్నీ ఏమయ్యాయి. రోజుకు రూ. 475 కోట్ల అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం. నాలుగేళ్లలో జగన్ రాష్ట్రంలో నాలుగు ఇళ్లు కట్టాడు.మనం కట్టిన టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు ఇవ్వలేదు. 

లోకేష్ యువగళంలో సెల్ఫీ చాలెంజ్ విసురుతున్నాడు. కార్యకర్తలు కూడా మీ గ్రామంలో మనం చేసిన పనిపై సెల్ఫీ చాలెంజ్ విసరండి. జగన్ కు ట్యాగ్ చేయండి. సమస్యలపైనా సెల్ఫీ చాలెంజ్ తో ప్రశ్నించండి. దేశంలో రిచ్చెస్ట్ సిఎంగా ఉన్న జగన్....తాను పేదల మనిషి అంటున్నాడు....వర్గ పోరు అని కొత్త మాటలు చెపుతున్నాడు. ఊరు ఊరుకూ ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల వ్యక్తా.....పేదలకు ఒక్క ఇల్లు కట్టని వ్యక్తి పేదల వ్యక్తా.  రాష్ట్రంలో రైతు బజార్ లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సిఎం జగన్.  నాడు విశాఖ ఉక్కు విషయంలో పోరాడి సమస్యను పరిష్కరించాం. నాడు ప్రైవేటీ కరణకు అడ్డుపడ్డాం. డిల్లీ మెడలు వంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి డిల్లీ ఎందుకు వెళుతున్నాడు. ప్రత్యేక హోదా వచ్చిందా.....గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అయ్యిందా....పోలవరం పూర్తి అయ్యిందా....రైల్వే జోన్ డిమాండ్ పూర్తిగా నెరవేరిందా....సిఎం డిల్లీ ఎందుకు వెళుతున్నాడు? జగన్ మా భవిష్యత్ అని ఇప్పుడు స్టిక్కర్లు వేస్తారట. జగన్ మన భవిష్యత్ కాదు. జగనే మన దరిద్రం. మనకు శాపం. 

జగన్ కు ఎప్పుడూ విశాఖపై ప్రేమ లేదు. విశాఖ భూములు, ఆస్తులపై ప్రేమ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ గెలిచే అవకాశమే లేదు. ఈ ప్రభుత్వ ఎక్సైపైరీ టైం వచ్చింది.  మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మైండ్ బ్లాక్ అయ్యి...ఇప్పుడు ఎమ్మెల్యేలను గౌరవిస్తా అంటున్నాడు. ఈ నాలుగేళ్లు తెలుగు దేశం పార్టీ కోసం పోరాడిన మీకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. పట్టబద్రుల ఎన్నికల్లో తిరుగుబాటు.....వచ్చే ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు అవుతుంది.మేం 175 పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్ ను ఓడిస్తాం. అచ్చెన్నాయుడు తో మొదలు పెట్టి అందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నికేసులు పెట్టినా క్యాడర్, లీడర్లు భయపడలేదు. ఎన్నికేసులు పెట్టినా పార్టీ పోరాటం ఆగదు. 

తెలుగు దేశం పార్టీలో నేతలు అందరినీ కలుపుకుని పోవాలి. కొందరు పార్టీలో విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. విభేదాలు సృష్టించిన నేతలకు పదవులు రావు, పార్టీలో గ్రూపులు పెట్టిన వారికి పదవులు రావు. పార్టీలో త్యాగాలు చేసిన వారికి, పనిచేసిన వారికి పదవులు వస్తాయి. నాలుగేళ్లు పోరాడారు....మీ త్యాగాలు మరిపోం. అయితే పార్టీ బలోపేతం కోసం బయట వాళ్ల వస్తే పార్టీలో చేర్చుకోండి. మొదటి ప్రాధాన్యం పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే...ఆ తరువాతనే పార్టీలో చేరే వారికి ప్రాధాన్యం. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తాం. ఈ సారి ముందుగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఆమేరక ప్రయత్నం చేస్తున్నా. క్యాండెట్ ఎవరు అనేది కాదు...జెండా గెలవాలి అని చూడండి’’ అని చంద్రబాబు ప్రసంగించారు. 


  • Loading...

More Telugu News