Somireddy Chandra Mohan Reddy: మీతో ఏ పార్టీ అయినా కలుస్తుందా?... సీఎం జగన్ వ్యాఖ్యలకు సోమిరెడ్డి కౌంటర్

Somireddy counters CM Jagan challenge

  • చంద్రబాబుకు దత్తపుత్రుడు తోడయ్యాడన్న జగన్
  • 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ సవాల్
  • ఏ పార్టీ కూడా జగన్ తో కలవబోదన్న సోమిరెడ్డి
  • ఆర్థికనేరస్తుడితో కలిసేందుకు ఎవరు ముందుకొస్తారని వ్యాఖ్యలు

దుష్ట చతుష్టయానికి దత్తపుత్రుడు కూడా తోడయ్యాడని... చంద్రబాబుకు, దత్తపుత్రుడికి దమ్ముంటే రాష్ట్రంలో 175 స్థానాల్లో పోటీ చేయాలని సీఎం జగన్ ఇవాళ సవాల్ విసరడం తెలిసిందే. తెనాలిలో రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

దీనిపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు, మీతో ఏ ఒక్క పార్టీ అయినా కలుస్తుందా? అని ఎద్దేవా చేశారు. జగన్ 175 స్థానాల గురించి మాట్లాడుతున్నారు... కనీసం ఒక్క స్థానంలో అయినా మీతో కలిసి నడిచే పార్టీ ఉందా? అని వ్యంగ్యంగా అన్నారు.  

"ఆర్థిక నేరస్తుడు జగన్ తో ఎవరు పొత్తు పెట్టుకుంటారు? పాలనాధికారం ఇచ్చిన ప్రజలనే మోసగించిన వ్యక్తి జగన్" అని విమర్శించారు. ఒంటరిగా పోటీ చేయడం టీడీపీకి కొత్త కాదని సోమిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 1983 నుంచి పలు ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసిందని గుర్తు చేశారు. 

కలిసి వచ్చిన పార్టీలతో చేయి కలిపి కొన్ని ఎన్నికల్లో పోటీ చేశామని... నేషనల్ ఫ్రంట్, యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాల్లోనూ భాగస్వాములం అయ్యామని వివరించారు. నియంత, అరాచకవాది కాబట్టే జగన్ తో కలిసి నడిచేందుకు ఏ పార్టీ ముందుకు రావడంలేదని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవం ఇలా ఉంటే... దాన్ని గొప్పగా చెప్పుకోవడం జగన్ కే చెల్లిందని ఎద్దేవా చేశారు.

Somireddy Chandra Mohan Reddy
Jagan
Chandrababu
Pawan Kalyan
TDP
YSRCP
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News