AK-203: ఏకే-47లను మించిన ఏకే-203 తుపాకులను ఉత్పత్తి చేస్తున్న భారత్

India manufactures AK203 rifles

  • భారత సైన్యం కోసం అత్యాధునిక తుపాకులు
  • ఏకే-200 సిరీస్ లో లేటెస్ట్ వెర్షన్ ఏకే-203
  • నిమిషానికి 700 రౌండ్ల సామర్థ్యం
  • ఫైరింగ్ రేంజి గరిష్ఠంగా 800 మీటర్లు

ప్రపంచ ఆయుధ చరిత్రలో ఏకే-47 తుపాకులు విప్లవాత్మకం అని చెప్పాలి. ఆటోమేటిక్ రైఫిళ్లలో ఇంతటి విధ్వంసకారి మరొకటి లేదు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఈ రష్యా తయారీ తుపాకీ కనిపిస్తుంది. సైనికుల వద్దే కాదు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల చేతుల్లోనూ ఏకే-47 తుపాకులు ఉంటున్నాయి. 

40వ దశకంలో ఈ తుపాకీ రూపుదాల్చింది. ఇప్పటివరకు దీనికి సంబంధించి పలు వెర్షన్లు వచ్చాయి. అయితే, అన్ని వెర్షన్లను మించి ఏకే-200 సిరీస్ లో అత్యాధునిక అస్సాల్ట్ రైఫిల్ ను ఇప్పుడు భారత్ ఉత్పత్తి చేస్తోంది. దీనిపేరు ఏకే-203. 

భారత్-రష్యా సంయుక్త భాగస్వామ్యంతో అమేథీలోని కోర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తొలి బ్యాచ్ తుపాకులు తయారయ్యాయి. ఇది 7.62 ఎంఎం తుపాకీ. త్వరలోనే ఈ తుపాకులు భారత సైన్యం చేతికి అందనున్నాయి. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన బ్రాండ్ కలాష్నికోవ్ కు చెందిన ఏకే-200 సిరీస్ అస్సాల్ట్ రైఫిళ్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించిన తొలిదేశం భారత్ కావడం విశేషం. 

భారత సైన్యం ఇప్పటివరకు ఇన్సాస్ రైఫిళ్లను వినియోగిస్తోంది. ఇకపై ఇన్సాస్ స్థానంలో ఏకే-203 రైఫిళ్లు ఉపయోగించనున్నారు. ఈ తుపాకుల రేంజి గరిష్ఠంగా 800 మీటర్లు. నిమిషానికి 700 రౌండ్లు కాల్చవచ్చు. 

కాగా, ఏకే-47 తుపాకులను 1946లో రష్యా మిలిటరీ ఇంజినీర్ మిఖాయిల్ కలాష్నికోవ్ డిజైన్ చేశారు. ఆయన పేరు మీదుగానే ఈ తుపాకులకు ఏకే (ఆటోమేట్ కలాష్నికోవ్) అని నామకరణం చేశారు. ఆ తర్వాత ఏకే తుపాకులను పలు వెర్షన్లలో అభివృద్ధి చేశారు.
.

  • Loading...

More Telugu News