Chandrababu: 40 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలిసారి సీఎం అయిన ఎన్టీఆర్.. చంద్రబాబు స్పందన

Chandrababu press note on the occasion of NTR took oath 40 years back as CM

  • రాష్ట్రానికి సంక్షేమం, అభివృద్ధిని పరిచయం చేసింది టీడీపీ అన్న చంద్రబాబు
  • మళ్లీ టీడీపీతోనే ఏపీకి పునర్వైభవమని వ్యాఖ్య
  • ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చేందుకు కంకణబద్ధులై పని చేద్దామని పిలుపు

తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారాన్ని చేపట్టి నేటితో 40 ఏళ్లు పూర్తయ్యాయి. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 40 ఏళ్ల క్రితం ఇదే రోజున సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నందమూరి తారక రామారావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు, తెలుగు జాతి చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన రోజని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతోనే తెలుగు వారి జీవితాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. 

తెలుగు జాతి ప్రయాణాన్ని... 1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావానికి ముందు.... టీడీపీ ప్రభుత్వం ఆవిర్భావం తరువాత అని చూడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. నాటి దారుణ రాజకీయ పరిస్థితులు, ప్రజల వెతలు చూసిన ఎన్టీఆర్.. పేదరికం లేని సమాజం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారాన్ని చేపట్టారని గుర్తు చేశారు. 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజల మధ్యకు వచ్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఎన్టీఆర్ ప్రమాణం స్వీకారం చేశారని... తెలుగు ప్రజల జీవితాల్లో పెనుమార్పులకు నాంది పలికిన రోజు అని అన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, భూమి శిస్తు రద్దు, సింగిల్ విండో విధానం, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, రూ. 50లకే రైతులకు హార్స్ పవర్ విద్యుత్, మహిళలకు ఆస్తిహక్కు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, వృద్ధులకు పింఛన్లు, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ, విప్లవాత్మకమైన కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మహిళల కోసం ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీని ఏర్పాటు చేసింది, మహిళల కోసం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమే అని అన్నారు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కింది తెలుగుదేశం ఆవిర్భావంతోనే అని చంద్రబాబు అన్నారు. నాటి ప్రభుత్వంలో, పాలనలో బీసీలకు ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా బీసీల రాజకీయ ఎదుగుదలకు నాంది పలికిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపు, మైనారిటీలకు ప్రత్యేక కార్పొరేషన్ ల ఏర్పాటుతో వారి జీవితాల్లో వెలుగు తెచ్చింది టీడీపీ అని అన్నారు. గ్రామాల్లో, మండల, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున స్కూళ్లు, కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ద్వారా అణగారిన వర్గాలకు విద్యను చేరువ చేసింది టీడీపీ అని చెప్పారు. 

తమ జీవితాల్లో మార్పు కోసం తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టిన... బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన పార్టీగా టీడీపీ ఎప్పటికీ నిలిచిపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని తెచ్చిపెడితే... తాను వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచానని అన్నారు. ఆ తరువాత కాలంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాలనలో సంస్కరణలు తీసుకొచ్చానని... ప్రజల వద్దకే పాలన వంటి కార్యక్రమాలతో పాలనలో జవాబుదారీ తనం తీసుకువచ్చానని తెలిపారు. పాలకులు అంటే సేవకులు అనే నినాదంతో ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేశామని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఐటీ, ఫార్మా, సేవల రంగాల్లో సంస్కరణలను అమలు చేసి ఆ ఫలితాలను పేదల, సామాన్యుల కుటుంబాలకు అందేలా చేశామని అన్నారు. దీంతో ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా అత్యధిక ప్రతిభ కలిగిన వారిలో తెలుగు ప్రజలు ముందు వరసలో నిలిచారని చెప్పారు. 

ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులు, రైతులకు సబ్సిడీలు, మద్దతు ధర, డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారత వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం నిత్యం కలలు కని... వాటిని సాకారం చేసిన ఏకైక ప్రభుత్వంగా తెలుగుదేశం నిలిచిపోతుంది అని అన్నారు. టీడీపీ తొలి ప్రభుత్వం ఏర్పడి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ....భవిష్యత్ ప్రయాణాన్ని నిర్దేశించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే పార్టీగా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సైకో పాలకుల చేతిలో సర్వనాశనం అవుతున్న రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటంలో టీడీపీ ముందుండి పని చేస్తుందని అన్నారు. ఎన్టీఆర్ కలలుగన్న పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు, ఆయన ఆశయ సాధన దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కంకణబద్దులై పనిచేద్దామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News