Jagan: ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడుతున్నా: జగన్

Want to change every students future says Jagan

  • రూ. 694 కోట్ల విద్యాదీవెన నిధులను తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన జగన్
  • పిల్లల చదువును ఆస్తిగా చూడాలన్న ముఖ్యమంత్రి
  • ఎంత మంది పిల్లలు ఉన్నా తాను చదివిస్తానని హామీ

పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి చదువేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈరోజు విద్యాదీవెన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జులై - సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ. 694 కోట్ల విద్యాదీవెన నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేశారు. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... పాదయాత్రలో ఇచ్చిన హామీలు తనకు గుర్తున్నాయని చెప్పారు. విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన కింద పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్ మెంట్ ను అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం విద్యాదీవెనతో పాటు వసతి దీవెన కూడా ఇస్తున్నామని చెప్పారు. ఈ పథకాల కోసం రూ. 12,401 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. పిల్లల చదువుకు పెడుతున్నదాన్ని వ్యయంగా కాకుండా, ఆస్తిగా చూడాలని చెప్పారు. ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తాను తపన పడుతున్నానని... ఎంత మంది పిల్లలు ఉన్నా వారిని తాను చదివిస్తానని అన్నారు. 

మహిళలను దగా చేసిన చంద్రబాబుకు మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు లేదని జగన్ అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలను వింటున్న జనం 'ఇదేం ఖర్మరా బాబూ' అనుకుంటున్నారని చెప్పారు.

Jagan
YSRCP
Vidya Deevena
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News