Talasani: బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకే టీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు: మంత్రి తలసాని

Talasani alleges that harassment intended to restrict BRS

  • హైదరాబాదులో టీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనం
  • హాజరైన మంత్రి తలసాని
  • టీఆర్ఎస్ జాతీయస్థాయికి వెళుతోందని వెల్లడి
  • అందుకే బీజేపీలో గుబులు మొదలైందని వ్యాఖ్యలు

హైదరాబాద్ టీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ జాతీయస్థాయికి వెళుతుండడంతో బీజేపీలో గుబులు మొదలైందని, బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకే తమలో కొందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల తీరు అభ్యంతరకరంగా ఉందని అన్నారు. మంత్రి నుంచి ఫోన్ లాక్కోవడం ఏంటి? అందరికీ టైమ్ వస్తుంది అని అన్నారు. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు బెదిరిపోయే పార్టీ కాదని తలసాని స్పష్టం చేశారు. 

ఇక, హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డా అని అన్నారు. టీఆర్ఎస్ శక్తిమంతమైన పార్టీ అని, తమను ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ కు తిరుగులేదని, తమ వెంట లక్షలాది మందితో కూడిన సైన్యం ఉందని తలసాని పేర్కొన్నారు. 

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని జరుగుతున్న ప్రచారంపైనా ఆయన స్పందించారు. బీజేపీ... టీఆర్ఎస్ కు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని, బీజేపీ అనేది నీటి మీద గాలి బుడగ వంటిదని కొట్టిపారేశారు.

కాగా, మంత్రి తలసాని ఇవాళ హైదరాబాదులో సూపర్ స్టార్ కృష్ణ దశదిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మహేశ్ బాబును, కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును పరామర్శించారు. 

  • Loading...

More Telugu News