Pakistan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్నీ ఇమ్రాన్ అమ్ముకున్నడు.. పాక్ రక్షణ మంత్రి ఆరోపణ

Imran Khan sold gold medal he received from India

  • రూ.3 వేల కంటే తక్కువకే కొన్నట్లు వెల్లడించిన లాహోర్ వ్యక్తి
  • పీసీబీకి డొనేట్ చేస్తే సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని వివరణ
  • 1987లో ఇమ్రాన్ సారథ్యంలో భారత్ లో పర్యటించిన పాక్ జట్టు
  • ముంబైలో పాక్ జట్టు తరఫున ఫీల్డింగ్ చేసిన సచిన్ టెండూల్కర్ 

మాజీ క్రికెటర్, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు విమర్శల పాలయ్యారు. ప్రధానిగా విదేశాలలో పర్యటించినపుడు అందుకున్న బహుమతుల దుర్వినియోగంపై ఇమ్రాన్ ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇమ్రాన్ పై పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. ప్రధానిగానే కాదు.. క్రికెటర్ గా ఉన్నపుడు విదేశాలలో అందుకున్న బహుమతులను అమ్మేసి ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నాడని మండిపడ్డారు. భారత్ ఇచ్చిన ఓ బంగారు పతకాన్ని ఇలాగే అమ్ముకున్నాడని ఆరోపించారు. అయితే, దీని గురించి మంత్రి మిగతా వివరాలను వెల్లడించలేదు.

భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని రూ.3 వేల కంటే తక్కువకే ఇమ్రాన్ ఖాన్ నుంచి తాను కొనుగోలు చేశానని లాహోర్ కు చెందిన షకీల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. నాణాలను సేకరించడం తన హాబీ అని ఇమ్రాన్ ఖాన్ అందుకున్న బంగారు పతకంతో పాటు మొత్తం ఆరు పతకాలను తాను కొన్నానని వివరించారు. ఆ పతకాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు డొనేట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి తనకు సర్టిఫికెట్ కూడా అందిందని షకీల్ వివరించారు.

1987లో భారత్ లో పర్యటించిన పాకిస్థాన్ టీమ్ ముంబైలో భారత జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ప్లేయర్ అబ్దుల్ ఖాదిర్ గాయపడగా.. సబిస్టిట్యూట్ ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ పాకిస్థాన్ తరఫున ఫీల్డింగ్ చేశారు. ఈ మ్యాచ్ తర్వాత పాక్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు ముంబై క్రికెట్ క్లబ్ ఓ బంగారు పతకాన్ని బహూకరించింది. ఈ పతకాన్ని ఇమ్రాన్ అమ్ముకున్నాడని తాజాగా పాక్ రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ ఆరోపించారు.

Pakistan
Imran Khan
gold medal
sold
india
pak ex pm
  • Loading...

More Telugu News