Mummy: ఈజిప్టు మమ్మీ ముఖాన్ని ఆవిష్కరించిన ఫోరెన్సిక్ నిపుణులు

Forensic experts creates face of ancient Mummy

  • ఓ మిస్టరీ మమ్మీకి ముఖాకృతి కల్పించిన పరిశోధకులు
  • ఎముకలు, పుర్రె ఆకారం ఆధారంగా ఆవిష్కరణ
  • 2డీ, 3డీ టెక్నాలజీతో అరుదైన ఘట్టం

ప్రపంచస్థాయిలో పురావస్తు శాస్త్రజ్ఞులకు ఈజిప్టు అత్యంత ఆసక్తికర ప్రదేశం అనడంలో సందేహం లేదు. అక్కడి పిరమిడ్లు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త రహస్యాన్ని చెబుతుంటాయి. ముఖ్యంగా, మమ్మీలుగా పిలిచే వేల ఏళ్ల నాటి మృతదేహాలు పరిశోధకులను ఆకర్షిస్తుంటాయి.

అత్యంత ప్రాచీన సమాధుల్లో ప్రత్యేక విధానంలో భద్రపరిచినట్టుగా ఉండే ఈ మమ్మీలపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, మమ్మీలపై వార్సా మమ్మీ ప్రాజెక్ట్ పేరిట ఓ అధ్యయనం కొనసాగుతోంది. తాజాగా, ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఫోరెన్సిక్ నిపుణులు ఓ మిస్టరీ మమ్మీకి ముఖాకృతిని కల్పించారు. ఆ మమ్మీ ఓ స్త్రీ కాగా, ఆమె జీవించి ఉన్నప్పుడు ఇలా ఉండేదంటూ ఆ మమ్మీ ముఖాన్ని ఆవిష్కరించారు. 

ఆధునిక 2డీ, 3డీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వారు ఆమె ముఖాన్ని రూపొందించగలిగారు. ముఖ ఎముకలు, పుర్రె ఆకారం, వాటి కొలతలను పరిగణనలోకి తీసుకుని ఆమె ముఖానికి ఓ రూపాన్నిచ్చారు. ఎముకలు, పుర్రె ఆకారం ద్వారా కచ్చితంగా కాకపోయినా పాక్షికంగా అయినా ముఖాకృతిని అంచనా వేయొచ్చని ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఇటలీ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్ట్ చాంటల్ మిలానీ వెల్లడించారు. 

సదరన్ పోలాండ్ లోని కాటోవైస్ నగరంలో ఉన్న సిలీసియా మ్యూజియంలో ఈ మమ్మీ ముఖాన్ని ప్రదర్శించారు. కాగా, ఆ మమ్మీ 20 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఓ ఈజిప్టు యువతిదని, మరణించేనాటికి ఆమె ఏడో నెల గర్భవతి అని పరిశోధనలో తేలింది. బహుశా ఆమె క్యాన్సర్ తో బాధపడి ఉండొచ్చని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. 

మమ్మీ స్థితిలో ఉన్న ఆమె దేహంలో అంతర్గత అవయవాలు తొలగించి ఉండగా, గర్భం మాత్రం యథాతథంగా ఉన్నట్టు గుర్తించారు. గర్భంలో శిశువు వున్నంతకాలం అది తల్లికే సొంతం అన్న ఈజిప్టు దేశ పురాతన భావనలకు అది నిదర్శనం అయ్యుంటుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

Mummy
Face
Forensic Experts
Egypt
Warsaw Mummy Project
  • Loading...

More Telugu News