Bandi Sanjay: ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పని చేశారు: బండి సంజయ్

Bandi Sanjay press meet over Munugode result

  • మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి
  • బండి సంజయ్ ప్రెస్ మీట్
  • టీఆర్ఎస్ నేతలు విర్రవీగుతున్నారని విమర్శలు
  • కేసీఆర్ 15 రోజుల్లో హామీలు నెరవేర్చాలని డిమాండ్

మునుగోడులో తమ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిపాలైన అనంతరం తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. మునుగోడులో ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా వచ్చారని అన్నారు. 

16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కోసం పనిచేశారని, అయినప్పటికీ వారి అభ్యర్థికి వచ్చింది ఓ మోస్తరు మెజారిటీ మాత్రమేనని విమర్శించారు. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్కో పోలింగ్ బూత్ కు పనిచేశారని తెలిపారు. 

ఇంతకీ మునుగోడులో గెలుపు ఎవరిది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ దా? కేటీఆర్ దా? హరీశ్ రావుదా? వామపక్షాలదా? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిదా? అని అన్నారు. ఈ ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ పార్టీ రూ.1000 కోట్లు పంచిందని ఆరోపించారు. 

మునుగోడు విజయం తర్వాత టీఆర్ఎస్ నేతలు విర్రవీగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే 15 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 

కాగా, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన 12 మందిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారని, వారితో రాజీనామాలు చేయించి ప్రజాక్షేత్రంలో తీర్పు కోరే దమ్ము టీఆర్ఎస్ పార్టీకి ఉందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

ఏదేమైనా మునుగోడులో ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని తెలిపారు. అనేక రకాలుగా బెదిరించినా, వెనుకంజ వేయకుండా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు శిరసు వంచి నమస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. మునుగోడు ఓటమిపై కార్యకర్తలు నిరుత్సాహపడొద్దని సూచించారు.

Bandi Sanjay
Munugode
Komatireddy Raj Gopal Reddy
BJP
TRS
ByPolls
  • Loading...

More Telugu News