Botsa Satyanarayana: ఓ సెలబ్రిటీ పార్టీ ఇటీవల కాపు నేతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: మంత్రి బొత్స

Botsa talks to media after Kapu meeting

  • రాజమండ్రిలో కాపు నేతల సమావేశం
  • హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించిన బొత్స 
  • కాపు వర్గానికి పెద్దపీట వేస్తున్నారని వెల్లడి

కాపు సామాజిక వర్గానికి చెందిన వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు రాజమండ్రిలో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం, గెలిపించడం, ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవులు ఇవ్వడం గానీ, ఇలా ఏ విషయంలో తీసుకున్నా గానీ సీఎం జగన్ కాపు వర్గానికి న్యాయం చేస్తున్నారని వివరించారు. 

అన్ని సామాజిక వర్గాలతో పాటు కాపులకు కూడా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడమే కాకుండా, ప్రత్యేకంగా కాపుల కోసమే కాపు నేస్తం పథకం అందిస్తున్నారని బొత్స పేర్కొన్నారు. ఈ పథకంతో తమ కాపు సామాజిక వర్గంలోని మహిళలు రూ.1500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఆర్థికసాయం పొందారన్న విషయాన్ని కూడా నేటి సమావేశంలో చర్చించామని బొత్స వెల్లడించారు.

వారం కిందట ఓ సెలబ్రిటీ పార్టీ నేతలు తమ సామాజిక వర్గం నేతలపై అసభ్యంగా మాట్లాడారనీ, ఆ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలిపారు. కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసం ఇంకా ఏం చేయాలో ఆ అంశాలను ఇవాళ్టి సమావేశంలో అందరినీ అడిగి తెలుసుకున్నామని, ఆయా అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళతామని బొత్స పేర్కొన్నారు. 

ఇవాళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలం మాత్రమే సమావేశమయ్యామని, త్వరలో విజయవాడలో విస్తృతస్థాయిలో కాపు సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, మేయర్ పదవులు, జడ్పీలు, స్థానిక సంస్థల పదవుల్లో ఉన్న కాపు నేతలు కూడా హాజరవుతారని వివరించారు. త్వరలోనే ఈ సమావేశం తేదీని వెల్లడిస్తామని తెలిపారు.

Botsa Satyanarayana
Kapu
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News