Hyderabad: తెలంగాణలో అప్పుడే వణికిస్తున్న చలిపులి.. 54 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Temperatures Gradually Decreasing In Telangana

  • అప్పుడే పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
  • 54 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో 14.9 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు
  • ఉష్ణోగ్రతలు పడిపోయినంత మాత్రాన శీతాకాలం ప్రారంభమైనట్టు కాదన్న వాతావరణశాఖ
  • వికారాబాద్ జిల్లా బంట్వారంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

తెలంగాణలో చలిపులి అప్పుడే విజృంభిస్తోంది. గత 54 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా అక్టోబరులో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 26 అక్టోబరు 1968లో హైదరాబాద్‌లో 11.7 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ నెల 24న 14.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగరంలో మూడో వారం వరకు సాధారణంగానే ఉన్న ఉష్ణోగ్రతలు ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయాయి. 22న 19.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాతి రోజుకు అది 16.3 డిగ్రీలకు పడిపోయింది. దీపావళి రోజున అది మరింత తగ్గి 14.9 డిగ్రీలుగా నమోదైంది. 

నిజానికి ప్రతి సంవత్సరం నవంబరు రెండో వారం తర్వాతి చలి పెరుగుతుంది. అయితే, ఈసారి మాత్రం అక్టోబరు మూడో వారం నుంచే చలి తీవ్రత పెరగడం మొదలైంది. ఆదివారం ఉదయం సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా 15.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 13.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయితే, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయినంత మాత్రాన శీతాకాలం ప్రారంభమైనట్టుగా చెప్పలేమని వాతావరణశాఖ పేర్కొంది. 

ఈశాన్య, పశ్చిమ దిశల నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగానే రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్టు తెలిపింది. గాలుల ప్రభావం తగ్గితే ఉష్ణోగ్రతలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటాయని వివరించింది. హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా ఉంటే వికారాబాద్ జిల్లా బంట్వారంలో ఆదివారం 10.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రతి సంవత్సరం అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో 13.3 డిగ్రీలు నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నా పగలు మాత్రం 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ప్రజలకు కొంత ఊరటనిచ్చే విషయమే.

Hyderabad
Winter Season
Breeze
Temperatures
  • Loading...

More Telugu News