Andhra Pradesh: విద్వేష రాజకీయాలకు కుప్పం ప్రజలు ఎప్పుడూ దూరమే: చంద్రబాబు

tdp chief completed 111 constituencies reviews so far

  • భేషజాలకు పోవద్దని కుప్పం నేతలకు చంద్రబాబు సూచన
  • నియోజకవర్గంలో అందరినీ కలుపుకెళ్లాలని దిశానిర్దేశం
  • కుప్పంతో పాటు మంగళగిరి, కర్నూలు, ఇచ్ఛాపురం సమీక్షలు నిర్వహించిన వైనం
  • గురువారం నాటికి 111 నియోజకవర్గాల్లో ముగిసిన సమీక్షలు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏమిటో తెలియాలంటే వైసీపీ ప్రభుత్వం కుప్పంలో చేస్తున్న అరాచకాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ది రాజకీయాలు మాత్రమే తెలిసిన కుప్పం ప్రజలకు వైసీపీ అరాచక రాజకీయం కొత్తగా ఉందని ఆయన అన్నారు. కుప్పంను తొలి నుంచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేశామని....హింసను, విద్వేష రాజకీయాలను ఇక్కడి ప్రజలు అనుమతించరని చంద్రబాబు అన్నారు. పార్టీ నియోజకవర్గాల ఇంచార్జ్ లతో సమీక్షలో భాగంగా గురువారం తన సొంత నియోజకవర్గం కుప్పం నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. 11 మంది క్లస్టర్ ఇంచార్జ్ లు, మండల పార్టీ అధ్యక్షులతో పాటు మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, నియోజకవర్గ ఇంచార్జ్ పి.ఎస్ మునిరత్నం, మనోహర్, త్రిలోక్ తో పాటు పలువురు నేతలు ఈ సమీక్షకు హాజరయ్యారు. 

సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు నిర్వహణ, ఓటర్ వెరిఫికేషన్ సహా పార్టీ కార్యక్రమాలపై చంద్రబాబు సమీక్ష చేశారు. నేతలు ఎవరూ భేషజాలకు పోవద్దని.....గ్రామ స్థాయి వరకు అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. కుప్పంలో ప్రజలు అభిమానంతో తనను గెలిపిస్తూ వస్తున్నారని....పులివెందుల మాదిరిగా భయ పెట్టి ఓట్లు వేయించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ఒకే సింబల్ పై అన్ని సార్లూ గెలిచిన నియోజకవర్గాలు కుప్పం, హిందూపురం మాత్రమేనన్నారు. ఇదే సందర్భంలో పులివెందులలో... నేతలు, పార్టీలు, గుర్తులు ఆయా ఎన్నికల్లో మారాయని పేర్కొన్నారు. కుప్పంలో నేతలను, కార్యకర్తలను... కేసులు, దాడులు, కుల విద్వేషాలతో నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని...దీన్ని స్థానిక నాయకత్వం సమర్థంగా తిప్పి కొట్టాలని సూచించారు. తమకు ఊడిగం చేసే అధికారులను ఉపయోగించుకుని అరాచకాలు చేస్తున్న వైసీపీ నేతల లెక్కలు సరిచేస్తామని చంద్రబాబు చెప్పారు. 

ఈ సందర్భంగా సమీక్షకు వచ్చిన నేతలు స్థానికంగా జరుగుతున్న పరిణామాలను అధినేత దృష్టికి తెచ్చారు. పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు తమను భయపెట్టలేదని.....పైగా అంతా ఇప్పుడు మరింత ఐక్యంగా పోరాడుతున్నామని చెప్పారు. ఈ తరహా ప్రభుత్వ పోకడలతో ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని వివరించారు. పొరుగు రాష్ట్రాల నుంచి, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి జనాన్ని తెచ్చినా కుప్పంలో సీఎం సభ సక్సెస్ కాకపోవడానికి స్థానికంగా వచ్చిన వ్యతిరేకతే కారణం అని నేతలు వివరించారు. కుప్పం అభివృద్ధికి రూపాయి ఖర్చు పెట్టని సీఎం... తన సభకు మాత్రం కోట్ల రూపాయలను వెచ్చించారని నేతలు తెలిపారు. నియోజకవర్గంలోని గుడిపల్లి మండలంలో మళ్లీ అక్రమ గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని, శాంతిపురం మండలంలో  పాఠశాలల్లో నాడు నేడు పనుల పేరుతో లక్షలు కాజేశారని నేతలు చెప్పారు. 

నియోజకవర్గంలోని నరేగా పనుల్లో లక్షల రూపాయల అవినీతి జరిగిందని, గుడిపల్లి మండలంలో 230 మంది వైసీపీ కార్యకర్తలకు నిబంధనలకు విరుద్దంగా డీకేటీ పట్టాలు ఇప్పించే పని మొదలయ్యిందని చంద్రబాబుకు నేతలు వివరించారు. ఇక కుప్పం రెస్కో సంస్థలో అక్రమంగా నియామకాలు జరుగుతున్నాయని వివరించారు. వైసీపీ నేతలు పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం తెప్పించి విక్రయాలు సాగిస్తున్నారని తెలిపారు. హంద్రీ నీవా పనులపై ప్రకటనలు తప్ప పని జరగడం లేదని వివరించారు. ఈ అంశాలపై స్థానికంగా ప్రభుత్వంపై పోరాడాలని నేతలకు చంద్రబాబు సూచించారు. గురువారం కుప్పంతో పాటు మంగళగిరి, కర్నూలు, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమీక్షలను చంద్రబాబు నిర్వహించారు. మంగళగిరి ఇంచార్జ్ నారా లోకేశ్, కర్నూలు ఇంచార్జ్ టీజీ భరత్, ఇచ్చాపురం ఇంచార్జ్ బెందాళం అశోక్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పటికి మొత్తం 111 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు సమీక్షలు చేశారు.

Andhra Pradesh
TDP
Kuppam
Mandadam
Kurnool
Ichapuram
Nara Lokesh
  • Loading...

More Telugu News