Rajiv Gandhi Foundation: సోనియా గాంధీ ట్రస్టులకు ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేసిన కేంద్రం

Center cancels FCRA licence to Sonia Gandhi trusts

  • సోనియా నేతృత్వంలో పనిచేస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలు
  • ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్రం ఆరోపణ
  • కఠిన చర్యలకు దిగిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
  • విదేశీ విరాళాలు స్వీకరించేందుకు విఘాతం

స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు స్వీకరించాలంటే ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ తప్పనిసరి. ఎఫ్ సీఆర్ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని అర్థం. అయితే, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆధ్వర్యంలోని రెండు ట్రస్టులకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేసింది. 

సోనియా నేతృత్వంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ రెండు సంస్థలు ఆర్థికపరమైన నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అందుకే ఈ రెండు సంస్థలపై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్ సీఆర్ఏ) ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఎఫ్ సీఆర్ఏ లైసెన్స్ రద్దు చేశామని కేంద్ర హోంశాఖ అధికారులు వెల్లడించారు. 

హోంశాఖ అంతర్ మంత్రిత్వ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు పత్రాల్లో అవకతవకలు, విదేశీ నిధుల దుర్వినియోగం, అక్రమ నగదు చెలామణీ తదితర అక్రమాలను ఈ కమిటీ గుర్తించినట్టు వివరించారు. 

కాగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు నిధులు అందించిన వారి జాబితాలో చైనా కూడా ఉండడం గమనార్హం. అంతేకాదు, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్థికనేరస్తుడు మేహుల్ చోక్సీ కూడా గతంలో పీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వగా, ఆ నిధులను రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు మళ్లించినట్టు అప్పట్లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆరోపించారు. 

ఈ ఫౌండేషన్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం తదితర ప్రముఖులు ట్రస్టీలుగా ఉన్నారు.

Rajiv Gandhi Foundation
Rajiv Gandhi Charitable Trust
FCRA
Sonia Gandhi
Union Govt
Home Ministry
Congress
India
  • Loading...

More Telugu News