Ramoji Group: రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూత

Ramoji group former MD Atluri Rammohan Rao passes away

  • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అట్లూరి
  • ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
  • పరిస్థితి విషమించడంతో నేడు కన్నుమూత
  • రేపు హైదరాబాదులో అంత్యక్రియలు
  • రామోజీరావుకు అట్లూరి బాల్యమిత్రుడు

మీడియా దిగ్గజం రామోజీరావు బాల్యమిత్రుడు, రామోజీ గ్రూపు సంస్థల మాజీ ఎండీ అట్లూరి రామ్మోహన్ రావు కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. రామ్మోహన్ రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. రేపు ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

అట్లూరి రామ్మోహన్ రావు జన్మస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి. బాల్యంలో రామోజీరావు, రామ్మోహన్ రావు కలిసి విద్యాభ్యాసం చేశారు. రామోజీరావు వ్యాపార రంగంలో ప్రవేశించగా, రామ్మోహన్ రావు ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. 

1975లో ఆయన ఉపాధ్యాయ వృత్తిని వదిలి ఈనాడు సంస్థలో చేరారు. ఆపై అంచెలంచెలుగా ఎదిగారు. ఈనాడు డైరెక్టర్ గా, ఎండీగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు, రామోజీరావు స్వప్నం అనదగ్గ ఫిలింసిటీ ఎండీగానూ అట్లూరి రామ్మోహన్ రావు కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇటీవలే పదవీ విరమణ చేశారు.

  • Loading...

More Telugu News