TRS: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేసిన ఈడీ

ed attaches trs mpnama nageswara rao properties

  • రుణాల పేరిట మోసానికి పాల్పడ్డారంటూ నామాపై ఈడీ కేసు
  • గతంలోనే రూ.67 కోట్లను జప్తు చేసిన ఈడీ
  • తాజాగా రూ.80.65 కోట్ల విలువ చేసే స్థిరాస్తుల జప్తు
  • జూబ్లీహిల్స్ లోని మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయాన్నీ జప్తు చేసిన ఈడీ

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం షాకిచ్చింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయం సహా సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లుగా ఈడీ వెల్లడించింది. నామా ఆధ్వర్యంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ రుణాల పేరిట మోసానికి పాల్పడిందంటూ ఇదివరకే ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఇదివరకే నామా కంపెనీల్లో సోదాలు చేపట్టిన ఈడీ గతంలోనే రూ.67 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసమంటూ రుణాలు తీసుకున్న మధుకాన్.. ఆ నిధుల్లో రూ.362 కోట్లను దారి మళ్లించినట్లు గుర్తించామని ఈడీ వెల్లడించింది. అంతేకాకుండా నామా నాగేశ్వరరావు, నామా సీతయ్యలు 6 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లుగా కూడా గుర్తించామని ఆ సంస్థ తెలిపింది. ఈ కేసులోనే తాజాగా నామాకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రధాన కార్యాలయంతో పాటు హైదరాబాద్ ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లో ఆ సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది.

TRS
Telangana
Enforcement Directorate
Nama Nageswara Rao
Madhucon Projects

More Telugu News