BJP: తన ఇంటికి వచ్చిన బండి సంజయ్​ని ఆలింగనం చేసుకున్న బూర నర్సయ్య

Boora Narasaih recieves Bandi Sanjay at  his house

  • ఈ నెల 19న బీజేపీలోకి నర్సయ్య గౌడ్
  • ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో తరుణ్ చుగ్, కేంద్ర మంత్రుల సమక్షంలో చేరిక
  • రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలోకి వెళ్తున్నానన్న నర్సయ్య  

టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19వ తేదీ ఆయన ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం ఉదయం బూర నర్సయ్య ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమైన తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి. తన ఇంటికి వచ్చిన సంజయ్ ను బూర నర్సయ్య ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. 

టీఆర్ఎస్ లో అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నానని నర్సయ్య చెప్పారు. సీఎం కేసీఆర్ తనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్, జేపీ నడ్డా, అమిత్ షాల ఆహ్వానం మేరకు బీజేపీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం.‌. ఘర్ వాపసీని తలపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. భువనగిరి పార్లమెంట్ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఉందన్నారు. పార్టీలకు అతీతంగా మోదీ ప్రభుత్వం.. అభివృద్ధికి సహకరించిందని చెప్పారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. 

మరోవైపు అధికార టీఆర్ఎస్ పై సంజయ్ ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ద్రోహుల పార్టీగా టీఆర్ఎస్ మారిందని విమర్శించారు. నర్సయ్య బీజేపీలో చేరనుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన చేరికతో మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమైందని జోస్యం చెప్పారు.

BJP
TRS
Bandi Sanjay
Boora Narasaih
join
  • Loading...

More Telugu News