YSRCP: ఆలూరు నియోజకవర్గ నేతలతో జగన్ భేటీ... ఈ రోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
![ap cm ys jagan meeting with aluru constituency leaders](https://imgd.ap7am.com/thumbnail/cr-20221013tn63481c461696e.jpg)
- ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరి జయరాం
- ఏడాదిన్నరలోనే ఎన్నికలు వస్తున్నాయన్న జగన్
- కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీకి విజయం దక్కుతుందని సూచన
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయి నేతలతో సమావేశం అవుతున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి మంత్రి గుమ్మనూరి జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి జయరాం కూడా హాజరు కాగా... ఆలూరు నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా నేతలు హాజరయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో జగన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయని చెప్పిన జగన్... ఈ రోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని ఆయన సూచించారు. గడచిన మూడేళ్లలో ఆలూరు నియోజకవర్గంలోని ప్రజలకు వివిధ పథకాల ద్వారా రూ.1,050 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామని జగన్ చెప్పారు. ఇదే విషయాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని ఆయన నియోజకవర్గ నేతలకు సూచించారు.