Team India: మహిళల ఆసియా కప్​లో ఏడోసారి ఫైనల్​కు దూసుకెళ్లిన భారత్​

 India storm into seventh Asia Cup final

  • సెమీస్ లో థాయ్ లాండ్ పై ఘన విజయం
  • సత్తా చాటిన షెఫాలీ, దీప్తి, రాజేశ్వరి
  • 74 పరుగుల తేడాతో చిత్తయిన థాయ్ జట్టు

మహిళల ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో  ఏడోసారి విజేతగా నిలిచేందుకు భారత జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ టోర్నీలో టీమిండియా ఏడోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. థాయ్ లాండ్ తో గురువారం జరిగిన సెమీఫైనల్లో 74 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 42) సత్తా చాటింది. జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 3 ఫోర్లతో 27), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 4 ఫోర్లతో 36) కూడా రాణించారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13) నిరాశ పరిచినా.. రిచా ఘోష్ (2), దీప్తి శర్మ (3) నిరాశ పరిచారు. థాయ్ లాండ్ బౌలర్లలో సిర్నారిన్ తిపోచ్ (3/24) మూడు వికెట్లు పడగొట్టింది. 

అనంతరం 149 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన థాయ్ లాండ్ ఓవర్లన్నీ ఆడి 74/9 స్కోరు మాత్రమే చేసింది. కెప్టెన్ చైవాల్ (21), నటాయ (21) మాత్రమే కాసేపు పోరాడారు. ఈ ఇద్దరు తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ  (3/7) నాలుగు ఓవర్లలో ఏడే పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ (2/10) రెండు వికెట్లు పడగొట్టింది. దాంతో, ఈ టోర్నీలో తొలిసారి సెమీఫైనల్ చేరుకున్న థాయ్ లాండ్ అక్కడే తన పోరాటాన్ని ముగించింది. పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగే రెండో సెమీ ఫైనల్ విజేతతో భారత్ శనివారం ఫైనల్లో పోటీ పడుతుంది.

Team India
womens team
asia cup
final
seventh time
thailand
  • Loading...

More Telugu News