Lakshmi Parvati: చంద్రబాబును ఇక కాలమే శిక్షించాలి: సుప్రీం తీర్పుపై లక్ష్మీపార్వతి స్పందన

Lakshmi Parvathi disappoints with Supreme Court verdict

  • చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ కోరిన లక్ష్మీపార్వతి
  • మరొకరి ఆస్తులతో మీకేం పని? అంటూ సుప్రీం వ్యాఖ్యలు
  • లక్ష్మీపార్వతి పిటిషన్ కొట్టివేత
  • చంద్రబాబుపై తుదివరకు పోరాడానని వ్యాఖ్య  

వైసీపీ నేత లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించాలని లక్ష్మీపార్వతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, "ఇతరుల ఆస్తుల వివరాలతో మీకేం పని? అన్ని అంశాలు పరిశీలించే కదా గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది" అంటూ సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. అంతేకాదు, లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆ మేరకు తీర్పునిచ్చింది. 

సుప్రీంకోర్టు తీర్పుపై లక్ష్మీపార్వతి స్పందించారు. ఒక్కో కోర్టు ఒక్కో విధంగా తీర్పునిస్తోందని, ఒక్కో మనిషికి ఒక్కో న్యాయమా? అని ఆమె వాపోయారు.

"మరొకరి ఆస్తులపై ప్రశ్నించడానికి మీరెవరు? అంటూ సుప్రీంకోర్టు నన్ను ప్రశ్నించింది. మరి జగన్ ఆస్తులపై ప్రశ్నించడానికి శంకర్ రావు ఎవరు? టీడీపీ నేతలకు ఏం పని? 2జీ స్పెక్ట్రమ్ కు సంబంధించిన కేసులో సుబ్రహ్మణ్యం ఎవరు? కోర్టు ఈ అంశాలను కూడా పరిగణించి నా పిటిషన్ పై తీర్పునిస్తే బాగుండేది" అని లక్ష్మీపార్వతి విచారం వ్యక్తం చేశారు. 

ఏదేమైనా తాను చంద్రబాబుపై తుదివరకు పోరాడానని, అవినీతిపరుడు చంద్రబాబును ఇక కాలమే శిక్షించాలని కోరుకుంటున్నానని తెలిపారు. నిస్సహాయురాలినైన తాను అంతకుమించి ఏం కోరుకోగలనని వ్యాఖ్యానించారు.

Lakshmi Parvati
Supreme Court
Chandrababu
Assets
  • Loading...

More Telugu News