Etela Rajender: పెద్ద ఇంజనీర్ కేసీఆరే.. అందుకే కాళేశ్వరం పంపుహౌజ్ లు మునిగాయి: ఈటల రాజేందర్ ఫైర్

Etela rajender alligations on kaleshwaram project

  • ఇంజనీర్లు చెప్పినా విననందుకే ఈ పరిస్థితి తలెత్తిందన్న ఈటల 
  • ఇప్పటికైనా ముంపు సమస్యను పరిష్కరించే యత్నం చేయాలని సూచన
  • ముంపు బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి

తానే పెద్ద ఇంజనీర్ ను అని సీఎం కేసీఆర్ తరచూ చెబుతుంటారని.. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల విలువైన పంపుహౌజ్ లు నీట మునిగాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లు ఎంతగా చెప్పినా సీఎం కేసీఆర్ వినకుండా ముందుకెళ్లారని.. అందుకే ఇలా వరద ముంపు పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఎంతో అనుభవం ఉన్న ఇంజనీర్లు రాష్ట్రంలో ఉన్నారని.. వారు ఈ ప్రాజెక్టు విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదని చెప్పారు. ఇంజనీర్లు ఈ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే చర్యల గురించి ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.

పట్టణాలూ మునిగే పరిస్థితి వచ్చింది
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంథని, మంచిర్యాల వంటి పట్టణాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసిన తీరు సరిగా లేదని.. అందువల్లే వేల ఎకరాల్లో పంటలు మునిగిపోతున్నాయని చెప్పారు. ఒకసారి ముంపు బారిన పడిన వారు ఆ నష్టం నుంచి కొన్నేళ్లయినా కోలుకోలేరని.. వారు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలకు ప్రభుత్వం అండగా నిలిచి, భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

కాళేశ్వరంతో కాదు.. వానల వల్లే పంటలు
తెలంగాణలో పెద్ద ఎత్తున పంటలు పండటానికి కాళేశ్వరం ప్రాజెక్టుగానీ, మరోటిగానీ కారణం కాదని.. కొన్నేళ్లుగా విస్తారంగా పడుతున్న వానలే పంటలకు తోడ్పడుతున్నాయని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ సీఎం కేసీఆర్ పరిధిలో పెట్టుకున్నారని, అధికారులపై పర్యవేక్షణ కొరవడిందని విమర్శించారు. రైతుల కష్టాలను పట్టించుకునేవారే లేకుండా పోయారన్నారు.

Etela Rajender
BJP
TRS
KCR
Kaleswaram Project
Floods
  • Loading...

More Telugu News