NEET: నీట్ పరీక్ష సందర్భంగా కేరళ కాలేజీలో అమ్మాయిల పట్ల అవమానకర ప్రవర్తన

Inhuman behavior towards NEET aspirant girl students

  • కొల్లాంలోని మార్థోమా కాలేజీకి నీట్ సెంటర్ కేటాయింపు
  • నిబంధనల పేరిట విద్యార్థినుల లోదుస్తులు తీసేయించిన సిబ్బంది
  • అలాగే పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన విద్యార్థినులు
  • విషయం తెలిసి భగ్గుమన్న తల్లిదండ్రులు

జాతీయస్థాయిలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం జులై 17న దేశవ్యాప్తంగా నీట్ నిర్వహించారు. అయితే, కేరళలోని కొల్లాంలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిల పట్ల అక్కడి సిబ్బంది అవమానకరంగా వ్యవహరించినట్టు వెల్లడైంది. 

కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ నీట్ పరీక్ష కేంద్రం కేటాయించారు. అయితే, పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలను అక్కడి సిబ్బంది నిశితంగా తనిఖీలు చేశారు. దాదాపు 100 మంది అమ్మాయిలను లోదుస్తులతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. 

లోహపు వస్తువులు ఉండే బెల్టుల వంటి వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. కాగా, లోదుస్తులకు సంబంధించి అక్కడి సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో, తీవ్ర అవమానకర పరిస్థితుల్లో ఆ అమ్మాయిలు తమ లోదుస్తులు విప్పేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. పరీక్ష ముగిసిన తర్వాత ఈ విషయం తెలిసి అమ్మాయిల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. వారు సదరు కాలేజీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

తమ కాలేజీకి నీట్ పరీక్ష సెంటర్ ను కేటాయించినా, తనిఖీలు, బయోమెట్రిక్ అంశాలను వేరే వ్యక్తులు పర్యవేక్షించారని మార్థోమా కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా, పరీక్షకు ముందు ఇలాంటి తనిఖీలతో ఎంతో వేదనకు లోనయ్యామని విద్యార్థినులు వెల్లడించారు.

NEET
Girl Students
Kollam
Kerala
  • Loading...

More Telugu News