Ranga Reddy District: పండ్ల వ్యాపారి హత్యకేసును ఛేదించిన పోలీసులు.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య

Wife plot to kill husband with lover

  • ఈ  నెల 11న దారుణ హత్యకు గురైన పండ్ల వ్యాపారి
  • జిమ్ ట్రైనర్‌తో వ్యాపారి భార్యకు వివాహేతర సంబంధం
  • అతడి అడ్డు తొలగితే మనం హ్యాపీగా ఉండొచ్చని ప్రియుడితో చెప్పిన జయసుధ
  •  నిందితులిద్దరూ అరెస్ట్

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో ఈ నెల 11న జరిగిన పండ్ల వ్యాపారి హత్యను పోలీసులు ఛేదించారు. ప్రియుడితో చెప్పి భార్యే అతడిని హత్య చేయించిందని నిర్ధారించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూరుకు చెందిన శంకరయ్య (43), జయసుధ (38) భార్యాభర్తలు. 14 సంవత్సరాల క్రితం బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. శంకరయ్య ఏడాది‌ క్రితం శంకర్‌పల్లి మండలంలోని టంగుటూరులో దానిమ్మతోటను లీజుకు తీసుకున్నాడు. వారానికోసారి అక్కడికి వెళ్లి వస్తుంటాడు. 

ఈ క్రమంలో జయసుధకు విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలానికి చెందిన జిమ్ ట్రైనర్ తిరుపతిరావు (25)తో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది మరింత ముదిరి వివాహేతర సంబంధానికి దారితీసింది. రోజూ తాగివచ్చి శంకరయ్య తనను  చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతడిని అడ్డుతొలగించుకుంటే మనం హ్యాపీగా ఉండొచ్చని తిరుపతిరావుకు జయసుధ చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి శంకరయ్య హత్యకు కుట్రపన్నారు.

అందులో భాగంగా ఈ నెల 11న శంకరయ్య తోటకు వెళ్లగా ఆ విషయాన్ని జయసుధ ప్రియుడికి చెప్పింది. శంకరయ్య తోట నుంచి ఇంటికి వస్తున్న సమయంలో టంగుటూరు గ్రామ శివారులో శంకరయ్య తలపై కట్టెతో బలంగా కొట్టిన తిరుపతిరావు.. ఆపై గొంతుకోసి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు వాడిన బైక్ ఆధారంగా శుక్రవారం నిందితుడు తిరుపతిరావును గుర్తించారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రిమాండ్‌కు తరలించారు.

  • Loading...

More Telugu News