YSRCP: 2024లో గన్నవరం నుంచి వంశీ పోటీ చేస్తారు: కొడాలి నాని
![kodali nani says that vallabhaneni vamsi will contest as ysrcp candidate from gannavaram in 2024 elections](https://imgd.ap7am.com/thumbnail/cr-20220630tn62bdc9163d36e.jpg)
- 2024లో గన్నవరం నుంచి తానే పోటీ చేస్తానన్న యార్లగడ్డ
- 2019 ఎన్నికల్లో స్వల్ప మార్జిన్తో ఓడిపోయిన వైనం
- వంశీకే టికెట్ అంటూ కొడాలి నాని ప్రకటించడంపై డైలమా
2024 ఎన్నికల్లో కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ మోహన్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ మేరకు గురువారం గన్నవరంలో జరిగిన కృష్ణా జిల్లా పార్టీ ప్లీనరీ వేదికగా కొడాలి నాని ఈ ప్రకటన చేశారు. నేతల మధ్య విభేదాలు ఉంటే పిలిచి మాట్లాడతానని సీఎం జగన్ చెప్పారని కూడా నాని వ్యాఖ్యానించారు. కొడాలి నాని ప్రకటనతో నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వర్గాలు డైలమాలో పడిపోయాయి.
2019 ఎన్నికలకు ముందు నుంచి గన్నవరం పార్టీ ఇంచార్జీగా దుట్టా రామచంద్రారావు వ్యవహరిస్తున్నారు. అయితే 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా ఎంట్రీ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ టికెట్ను దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో వంశీ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయగా... యార్లగడ్డపై కేవలం 800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని ఇటీవలే యార్లగడ్డ ప్రకటించారు. తాజాగా గన్నవరం నుంచి వంశీనే పోటీ చేస్తారంటూ నాని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.