G7: జీ7లో చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నా.. జర్మనీలో దిగగానే ప్రధాని మోదీ ట్వీట్​

Looking Forward To fruitful Discussions With G7 Leaders says PM Modi

  • మ్యూనిచ్ కు చేరుకున్నానంటూ ప్రధాని ట్వీట్
  • పర్యటన ఫొటోలు జత చేసిన నరేంద్ర మోదీ
  • ఉగ్రవాదం, ఉక్రెయిన్ సంక్షోభంపై సదస్సులో చర్చించే అవకాశం

జీ7 దేశాల అధినేతలతో చర్చలు ఫలవంతంగా సాగుతాయని ఆశిస్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన ప్రత్యేక విమానంలో జర్మనీలోని మ్యూనిచ్ కు చేరుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. ‘‘జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఇప్పుడే జర్మనీలోని మ్యూనిచ్ కు చేరుకున్నా.. సదస్సులో ప్రపంచ దేశాల నేతలతో చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నా..” అని పేర్కొన్నారు. తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను కూడా ట్వీట్ కు జత చేశారు. 

ఎన్నో అంశాలపై చర్చలు..
జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ షూల్జ్ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ7 దేశాల సదస్సుకు హాజరవుతున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాల నేతలు కలిసి పర్యావరణం, విద్యుత్, ఆహార భద్రత, ఉగ్రవాద నియంత్రణ, లింగ వివక్షను రూపుమాపడం, ప్రజాస్వామ్య పరిరక్షణ అంశాలపై చర్చలు జరపనున్నారు.

ప్రధాని మోదీని ఆహ్వానిస్తూ జర్మనీ రాజధాని బెర్లిన్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ట్వీట్ చేసింది. “జీ7 సదస్సు కోసం జర్మనీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. జర్మనీలోని భారత సంతతి ప్రజలు కూడా మోదీకి ప్రత్యేకంగా స్వాగతం పలుకుతున్నారు..” అని పేర్కొంది.

కాగా.. జీ7 సదస్సు అనంతరం ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లనున్నారు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ కు నివాళి అర్పించనున్నారు.

  • Loading...

More Telugu News