Crocodile: రాజస్థాన్‌లో దారుణం.. నదిలో స్నానం చేస్తుండగా వ్యక్తిని లాక్కెళ్లిన మొసలి

 Crocodile drags man into river in Rajasthnas kota

  • ఖటోలిలోని పార్తి నదిలో స్నానం చేస్తుండగా ఘటన
  • గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది
  • ఈ నెల మొదట్లో యూపీలోనూ ఇలాంటి ఘటనే
  • స్నానం చేస్తున్న బాలుడిని బలితీసుకున్న మకరం

నదిలో స్నానం చేస్తున్న వ్యక్తిపై దాడిచేసిన మొసలి అతడిని లాక్కెళ్లింది. రాజస్థాన్‌లోని కోటాలో జరిగిందీ షాకింగ్ ఘటన. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మొసలి లాక్కెళ్లిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇక్కడి ఖటోలి పట్టణంలోని పార్తి నదిలో బిల్లూ అనే 38 ఏళ్ల వ్యక్తి స్నానానికి దిగాడు. అప్పటికే అక్కడ నక్కి ఉన్న మొసలి ఒక్కసారిగా అతడిపై దాడిచేసి నోట కరుచుకుని నదిలోకి లాక్కెళ్లిపోయింది.

నదిలో స్నానం చేస్తున్న మిగతా వారు భయంతో ఒడ్డుకు చేరుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నది వద్దకు చేరుకుని బిల్లూ కోసం గాలించారు. నదిలో మొసళ్లు ఉండడంతో పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. కాగా, ఈ నెల మొదట్లో ఉత్తరప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఓ కొలునులో స్నానం చేస్తున్న బాలుడిపై దాడిచేసిన మొసలి అతడిని చంపేసింది.

Crocodile
Rajasthan
Kota
River
  • Loading...

More Telugu News