Prime Minister: 14 మంది ప్రధానుల జీవిత విశేషాలతో సంగ్రహాలయం.. ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates Pradhanamantri Sangarahalaya

  • ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మ్యూజియం
  • 15,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం
  • రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తితో డిజైన్

దేశానికి సేవలందించిన 14 మంది ప్రధాన మంత్రుల జీవిత విశేషాలతో న్యూ ఢిల్లీలో ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని  (మ్యూజియం) ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత్ ను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ మ్యూజియంను ఏర్పాటు చేసింది. 

ఢిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్ లో 15,600 చదరపు మీటర్ల వైశాల్యంతో రెండు బ్లాకులు, 43 గ్యాలరీలతో ఈ సంగ్రహాలయాన్ని నిర్మించారు. రైజింగ్ ఇండియా కథ స్ఫూర్తిగా ఈ మ్యూజియానికి డిజైన్ చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామం, రాజ్యాంగ నిర్మాణం, ప్రధానులు ఎదుర్కొన్న వివిధ సవాళ్లు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన వైనాన్ని మ్యూజియంలో చూపించనున్నారు. 

వాటితో పాటు దివంగత ప్రధానులు ఉపయోగించిన వస్తువులనూ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టనున్నారు. నేత తరానికి ఆనాటి ప్రధానుల సేవలు, నాయకత్వ పటిమ, దార్శనికత, విజయాల గురించి తెలియజేసేందుకు ప్రధానమంత్రి సంగ్రహాలయ ఎంతో దోహదం చేయనుంది. 

కాగా, మ్యూజియాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియం అంతా కలియతిరిగారు. ప్రధానుల గురించిన జీవిత చరిత్రలను వీడియోల ద్వారా వీక్షించారు.

Prime Minister
Narendra Modi
New Delhi
Azadi Ka Amrit
Museum
Pradhana Mantri Sangrahalaya

More Telugu News