Mylavaram: బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న మా నేతలను చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి: వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

YCP MLA Vasantha Venkata Krishna Prasad sensational comments
  • నియోజకవర్గ పరిధిలో రూ. 200 కోట్ల పనులకు బిల్లులు రావాల్సి ఉందన్న ఎమ్మెల్యే
  • బిల్లులు రాక మైలవరం పంచాయతీ ఉప సర్పంచ్ తన భూమిని అమ్ముకున్నారని ఆవేదన
  • దేవినేని వ్యాఖ్యలకు కౌంటర్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో తమ నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారిని చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో దాదాపు రూ. 200 కోట్ల పనులకు బిల్లులు రావాల్సి ఉందన్నారు.

రూ. 2.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేసిన మైలవరం పంచాయతీ ఉప సర్పంచ్ సీతారెడ్డి బిల్లులు రాకపోవడంతో తనకున్న ఐదెకరాల మామిడితోటను అమ్ముకున్నారని వాపోయారు. ఈ విషయం తనకు తెలియడంతో క్షమించమని ఆయనను వేడుకున్నానన్నారు. అయితే, ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదని, బిల్లులు రావడం ఆలస్యమైనా సొంతూరుపై మమకారంతోనే సొంత నిధులను ఖర్చు చేసి పనులు పూర్తిచేశానని సీతారెడ్డి తనతో చెప్పారని తెలిపారు.

పూర్తి చేసిన అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోవడంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ‘సిగ్గులేదా?’ అని తమను ఎగతాళి చేశారని అన్నారు. అయితే, ఇబ్బందులున్నప్పటికీ తమ ప్రభుత్వం సంక్షేమాన్ని కొనసాగిస్తోందని, కాబట్టి సిగ్గు పడాల్సిన అవసరం లేదని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
Mylavaram
Vasantha Venkata Krishna Prasad
YSRCP

More Telugu News