Kolkata Knight Riders: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆపసోపాలు పడిన బెంగళూరు

Royal Challengers Bangalore won by 3 wkts

  • 128 పరుగులకే కుప్పకూలిన కోల్‌కతా
  • ఈ సీజన్‌లో ఇదే అత్యల్ప స్కోరు
  • నాలుగు వికెట్లు తీసిన హసరంగకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా గత రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన స్కోరింగ్ మ్యాచ్‌లో బెంగళూరునే విజయం వరించింది. 129 పరుగుల విజయ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆర్సీబీ ఆపసోపాలు పడింది. చివరికి ఏడు వికెట్లు కోల్పోయి మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. ఆ జట్టులో షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ చేసిన 28 పరుగులే అత్యధికం కాగా, షాబాజ్ అహ్మద్ చేసిన 27 పరుగులు రెండో అత్యధికం. కెప్టెన్ ఫా డుప్లెసిస్ 5, కోహ్లీ 12 పరుగులు చేశారు. 

ప్రత్యర్థి ఎదుట ఉంచిన స్వల్ప విజయ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు కేకేఆర్ బౌలర్లు టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్ తీవ్రంగా శ్రమించారు. నిప్పులు చెరిగే బంతులతో బెంగళూరుపై విరుచుకుపడ్డారు. సౌథీ 3, ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా 16 ఓవర్లలో 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి బెంగళూరు కష్టాల్లో పడింది. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. 

ఈ క్రమంలో క్రీజులో పాతుకుపోయిన రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్ బౌలర్లను ఎదురొడ్డి నెమ్మదిగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టి అభిమానుల్లో ఆశలు రేపారు. చివర్లో దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 14 పరుగులు, హర్షల్ పటేల్ 6 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేయడంతో విజయం ఆర్సీబీ సొంతమైంది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రెహానే (9), వెంక‌టేశ్ అయ్య‌ర్‌ (10) స్వ‌ల్ప స్కోర్లకే అవుట‌య్యారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా 13 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. ఆ తర్వాత కూడా క్రీజులో ఎవరూ కుదురుకోలేక‌పోయారు. ఫలితంగా 128 ప‌రుగుల‌కే కోల్‌క‌తా త‌న ఇన్నింగ్స్‌ను ముగించేసింది. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప స్కోరు ఇదే. ఆ జట్టులో ఆండ్రూ రసెల్ చేసిన 25 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఉమేశ్ యాదవ్ చేసిన 18 పరుగులు రెండో అత్యధికం. 

బంతుల‌తో రెచ్చిపోయిన బెంగ‌ళూరు బౌల‌ర్లు కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌ను ఏమాత్రం కుదురుకోనీయ‌కుండా ప‌క‌డ్బందీగా బౌలింగ్ చేశారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హ‌స‌రంగా ఏకంగా 4 వికెట్లు తీసుకోగా.. ఆకాశ్ దీప్ 3 వికెట్లు, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ 2 వికెట్లు తీసుకున్నారు. ఐపీఎల్‌లో నేడు లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి.

  • Loading...

More Telugu News