KCR: ​రాఫెల్ డీల్ దొంగతనం ఢిల్లీలో బట్టబయలు చేస్తాం: సీఎం కేసీఆర్

CM KCR fires on PM Modi and BJP leaders

  • ప్రధాని మోదీ, బీజేపీపై సీఎం కేసీఆర్ ధ్వజం
  • దమ్ముంటే తనను జైలుకు పంపాలని సవాల్
  • బీజేపీ మస్ట్ గో అంటూ తీవ్ర ఆగ్రహం
  • మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందన్న కేసీఆర్

హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీపైనా, బీజేపీ నేతలపైనా నిప్పులు చెరిగారు. బీజేపీ మస్ట్ గో... బీజేపీ ఈ దేశం నుంచి వెళ్లిపోవాలంతే అంటూ మండిపడ్డారు. ఇలాంటి వాళ్లు అధికారంలో ఉండడానికి వీల్లేదని అన్నారు. ఇప్పటికే బీజేపీ చేసిన పాపాలు ఎక్కువైపోయాయని, మోదీకి ఇచ్చిన సమయంలో 80 శాతం అయిపోయిందని వ్యాఖ్యానించారు.

"విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, లలిత్ మోడీ, మేహుల్ చోక్సీ వంటి వ్యక్తులు ఏంచేశారో తెలియదా? ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని విడిచి పారిపోయినవాళ్లంతా మోదీ దోస్తులే. ఎవడైనా మగాడు ఈ అంశాలపై మాట్లాడాలి. ఇవన్నీ వదిలిపెట్టి నన్ను జైలుకు పంపుతామని అంటున్నారు. వీళ్లను చూస్తే నిజంగా జాలి కలుగుతుంది... దమ్మున్నవాళ్లయితే నన్ను జైల్లో వేయాలి కదా! వచ్చి నన్ను జైల్లో వేయండి... అయినా జైల్లో వేస్తా అనగానే ఎవరో తోకగాళ్లు భయపడతారు కానీ, మాకేం భయం!

మమ్మల్ని కాదు... మిమ్మల్ని జైల్లో వేయడం మాత్రం పక్కా! కేంద్రం అవినీతిపై భయంకరమైన చిట్టా ఉంది. మొత్తం బద్దలు కొడతాం. రాఫెల్ డీల్ గురించి రాహుల్ గాంధీ ఎప్పటినుంచో పోరాడుతున్నారు. మేం కూడా సుప్రీంకోర్టులో కేసు వేయబోతున్నాం. మోదీ సర్కారు దీంట్లో వేల కోట్లు మింగింది. ఈ దొంగతనాన్ని మేం బయటపెడతాం.

మన కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్ యుద్ధవిమానాలను 9.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నిన్న ఇండోనేషియా దేశం 42 రాఫెల్ యుద్ధవిమానాలను కేవలం 8 బిలియన్ డాలర్లకే కొన్నది. మన కంటే తక్కువ ధరకే కొనుగోలు చేసింది. పైగా ఇండోనేషియా 6 విమానాలు ఎక్కువగా కొనుగోలు చేసింది. ఇప్పుడు తెలియడంలేదా ఎవడు దొంగ అనేది? ఎవడు జైలుకు పోతాడో వాడే పోవాలి కదా! నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఢిల్లీలో దీనిపై వందశాతం పంచాయితీ పెడతాం" అని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

KCR
Narendra Modi
BJP
Rafale Jets
TRS
Telangana
India
  • Loading...

More Telugu News